లండన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత రోజర్ ఫెడరర్ తన గొప్ప మనుసును చాటుకున్నాడు. రష్యాతో యుద్ధంలో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉక్రెయిన్కు తన వంతు సాయం ప్రకటించాడు. అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో ఉక్రెయిన్ చిన్నారుల విద్యకు బాసటగా నిలుస్తానని వెల్లడించాడు. తన ఫౌండేషన్ ద్వారా 5 లక్షల డాలర్లు(సుమారు రూ.3.8 కోట్లు) విరాళాన్ని అందజేశాడు.
రష్యా దాడిలో ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున పాఠశాలలు ధ్వంసమై పిల్లల చదువుకు ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఫెదరర్ సాయం ప్రకటించాడు.
🕊💙💛 pic.twitter.com/HEwb5NGREu
— Roger Federer (@rogerfederer) March 18, 2022
ఇక ఉక్రెయిన్ చిన్నారుల పరిస్థితిపై ఫెదరర్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఫొటోలను చూసి నేను, నా కుటుంబ సభ్యులకు భయాందోళనకు గురయ్యాం. అమయాక ప్రజల కోసం నా వంతుగా సాయమందిస్తా. శాంతి కోసం నిలబడతాము. ఉక్రెయిన్ నుంచి వచ్చిన పిల్లలకు సహాయం అందిస్తాం. సుమారుగా 60 లక్షల మంది ఉక్రెయిన్ చిన్నారులు చదువుకు దూరమయ్యారు.
ఇదొక విపత్కర పరిస్థితి అని తెలుసు. విద్యను అందించడానికి కృషి చేస్తాం. అత్యంత బాధాకరమైన ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికి వారికి మద్దుతు ఇవ్వాలని అనుకుంటున్నాం. రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ ద్వారా నిరంతర పాఠశాల విద్య కోసం 5 లక్షల డాలర్లను ఖర్చు చేయనున్నాం'అని రోజర్ ఫెడరర్ ట్వీట్ చేశాడు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్లోని నగరాలపై రష్యా సైనికులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
వింబుల్డన్ 2021 క్వార్టర్ ఫైనల్ ఓటమి అనంతరం మళ్లీ రోజర్ ఫెడరర్ రాకెట్ పట్టలేదు. మోకాలి గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్తో పాటు ఈ ఏడాది జరిగిన ఫస్ట్ గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ఓపెన్కు దూరంగా ఉన్నాడు. ఇక మరో టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే సైతం ఉక్రెయిన్ చిన్నారులకు తనవంతు సాయం ప్రకటించాడు. ఈ ఏడాదంతా తనకు ప్రైజ్మనీగా దక్కే డబ్బులను ఉక్రెయిన్ చిన్నారుల చదువు కోసం ఖర్చుపెడతానని ప్రకటించాడు.