మాడ్రిడ్: జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరేవ్ మాడ్రిడ్ ఓపెన్ పురుషుల చాంపియన్గా నిలిచాడు. ఫైనల్లో ఇటలీ ప్లేయర్ మాటియో బెర్రెట్టిని మట్టికరిపించి.. రెండో మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్గా అతనికిది నాలుగో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్. సోమవారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్ జ్వేరేవ్ మాడ్రిడ్
6-7(8), 6-4, 6-3 తేడాతో మాటియో బెర్రెట్టిని ఓడించి టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
తుదిపోరులో తొలి సెట్ను కోల్పోయిన జ్వెరెవ్.. తర్వాతి రెండు సెట్లలో పుంజుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో ముగ్గురు టాప్-10 ప్లేయర్లను దాటేసి.. టైటిల్ను కైవసం చేసుకున్నాడు. "గత మూడు టైటిళ్ల ఫైనల్ మ్యాచ్ల్లో ఓటమి అనంతరం.. మాడ్రిడ్ ఓపెన్ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ టైటిల్ నాకు ఎంతో ప్రత్యేకం" అని జ్వెరేవ్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఇక మహిళల సింగిల్స్ టైటిల్ను బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం గాయం కారణంగా ఈ టోర్నీలో ఆడే విషయంలో సందిగ్ధత వ్యక్తం చేసి.. చివరి నిమిషంలో బరిలో నిలిచిన సబలెంకా చివరకు విజేతగా అవతరించింది. మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా)కి షాకిచ్చి.. ఎర్రమట్టి కోర్టులో తొలి డబ్ల్యూటీఏ టైటిల్ను ఖాతాలో వేసుకుంది.
ఆదివారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ అరీనా సబలెంకా 6-0, 3-6, 6-4తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ యాష్లే బార్టీపై విజయం సాధించింది. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో బార్టీ ఓడిపోవడం ఇదే తొలిసారి. యారా క్లాసిక్ వ్యాలీ ఓపెన్, మయామి ఓపెన్, స్టుట్గార్ట్ ఓపెన్ టోర్నీలలో ఫైనల్ చేరిన బార్టీ టైటిల్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సబలెంకా కెరీర్లో ఇది 10వ సింగిల్స్ టైటిల్.