మెల్బోర్న్ : ఆస్ట్రేలియాన్ ఓపెన్లో భారత వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ పోరాటం ముగిసింది. ఒస్తాపెంకో (లాత్వియా)తో మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగిన లియాండర్ పేస్కు రెండో రౌండ్లో చుక్కెదురైంది. పేస్-ఒస్తాపెంకో ద్వయం 2-6,5-7తో జామీ ముర్రే(యూకే)- బతేనియా మట్టెక్ సాండ్స్(అమెరికా) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే ధోని రికార్డు బద్దలు..
గంటా ఏడు నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్లో పేస్-ఒస్తాపెంకో జోడీ ఒక ఎస్ సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేయగా.. ప్రత్యర్థి జోడి నాలుగు ఎస్లు సంధించి 19 విన్నర్స్ కొట్టింది. ఇక తొలి సెట్ను అలవోకగా గెలిచిన జామీ-బతేనియ జోడీకి.. రెండో సెట్లో ఇండియా-లాత్వియా జోడీ గట్టిపోటీనిచ్చింది. రెండు జోడీలు ఎక్కడా తగ్గకుండా ఆడాయి. కానీ సత్తాచాటి బలమైన షాట్లతో విరుచుకుపడిన ప్రత్యర్థి జోడీ రెండో సెట్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుంది.
తొలి రౌండ్లో పేస్ -ఒస్తాపెంకో ద్వయం 6-7 (4-7), 6-3, 10-6తో స్టామ్ సాండర్స్-మార్క్ పొల్మాన్స్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. ఇక రోహన్ బోపన్న (భారత్)-నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం 6-4, 7-6 (7/4)తో నికోల్ మెలిచార్ (అమెరికా)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ బుధవారం జరగనుంది.
ఈ ఏడాది తర్వాత తన మూడు దశాబ్దాల ప్రొఫెషనల్ కెరీర్కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించిన 46 ఏళ్ల పేస్కు ఇదే చివరి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ కాగా.. నిరాశే ఎదురైంది. ఇండియా టెన్నిస్ ముఖచిత్రంగా నిలిచిన పేస్.. తన సుదీర్ఘ కెరీర్లో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. ఇందులో 8 పురుషుల డబుల్స్లో గెలవగా.. 10 మిక్స్డ్ డబుల్స్లో వచ్చినవి. 1996 అట్లాంట ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన పేస్.. ఓవరాల్గా 66 ఫ్రొఫెషనల్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇక ఏడు ఒలింపిక్స్ బరిలోకి దిగిన తొలి టెన్నిస్ ప్లేయర్గా, భారత ఆటగాడిగా పేస్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.