
న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2020 టోర్నీలో మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఆగ్రహంతో బంతితో లైన్ అంపైర్ కొట్టి టోర్నీ నుంచి డిస్ క్వాలిఫై అయిన ప్రపంచ నంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఘటన మరవక ముందే.. మరో స్టార్ ఆటగాడు మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా) ఫ్రస్టెషన్లో అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన నెలకొంది.
డొమినిక్ థీమ్తో సెమీస్ పోరులో తొలి సెట్లో 2-3తో వెనుకంజలో ఉన్న దశలో మెద్వెదేవ్ చెయిర్ అంపైర్తో గొడవకు దిగాడు. తన సర్వీస్లో బంతిని థీమ్ రిటర్న్ చేసిన సమయంలో దాన్ని మెద్వెదేవ్ నెట్కు కొట్టాడు. అయితే ఆ బంతి లైన్ బయట పడిందని వాదిస్తూ థీమ్ కోర్టులోకి వచ్చి చూపించాడు. అయితే ఇలా రావడం నిబంధనలకు విరుద్ధమని అంపైర్ చెప్పడంతో మెద్వెదేవ్ గ్రాండ్స్లామ్ సూపర్వైజర్ దగ్గరికి వెళ్లాడు.
అతను కూడా నెట్ను దాటి రాకూడదని చెప్పాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మెద్వెదేవ్ 'క్షమించండి. నేను ఎవరినైనా చంపానా? అవునా.. నెట్ను క్రాస్ చేసి చాలా పెద్ద తప్పు చేశా కాబోలు.. ఇలా జరిగినందుకు యూఎస్ ఓపెన్ నిర్వాహకులకు నా క్షమాపణలు' అంటూ చేతులు జోడిస్తూ సెటైరిక్ కామెంట్స్ చేశాడు.
2 గంటల 55 నిమిషాల పాటు జరిగిన ఈ సెమీస్ పోరులో రెండో సీడ్ థీమ్ 6-2, 7-6 (9/7), 7-6 (7/5)తో గత ఏడాది రన్నరప్, మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)పై గెలుపొందాడు. ఆద్యాంతం ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో ఈ ఇద్దరు ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. కీలక సమయాల్లో ఎలాంటి ఒత్తిడికిలోని కాని థీమ్.. తీవ్రంగా కష్టించి విజయాన్నందుకున్నాడు. ఇప్పటికే మూడుసార్లు గ్రాండ్స్లామ్ ఫైనల్లో ఓడిపోయిన డొమినిక్ థీమ్ ఈసారి ఎలాగైనా విన్నర్స్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాడు.
మరో సెమీఫైనల్స్లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 3 గంటల 23 నిమిషాల్లో 3-6, 2-6, 6-3, 6-4, 6-3తో 20వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై గెలిపొంది థీమ్తో ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో అమీతుమీ తేల్చుకోనున్నాడు.