Chess Oympiad: ఫుట్బాల్ ఆడిన చెస్ దిగ్గజం విశ్వనాథ్ ఆనంద్! (వీడియో)

చెన్నై: భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఫుట్బాల్ ప్లేయర్గా అవతారమెత్తాడు. చెన్నై వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత జట్లకు మెంటార్గా వ్యవహరిస్తున్న విశ్వనాథ్ ఆనంద్.. టోర్నీలో గురువారం రెస్ట్ డే కావడంతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ సేద తీరాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. చెస్ ప్లేయర్స్, అధికారులు సరదాగా ఆడిన ఈ మ్యాచ్లో విశ్వనాథన్ ఆనంద్ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ను తలపించాడు. ఈ వీడియోను చూసి అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) వెంటనే విశ్వనాథన్ ఆనంద్ను ప్లేయర్గా పరిగణించాలని డిమాండ్ చేస్తూ సెటైర్లు పేల్చుతున్నారు.
మెంటార్గా ఆనంద్..
చెస్ ఒలింపియాడ్లో విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. ఈ సారి మాత్రం ప్లేయర్గా బరిలోకి దిగకుండా మెంటార్గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు. ఈ పనే తనకు సంతోషాన్నిస్తుందని టోర్నీ ప్రారంభానికి ముందు చెప్పాడు. 'నేను మళ్లీ చెస్ ఒలింపియాడ్ ఆడటం గురించి ఆలోచించట్లేదు. అది భారత్లో జరిగినా ఇంకెక్కడ జరిగినా నేను ఆడాలనుకోవడం లేదు. నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. ప్రపంచ ఛాంపియన్షిప్ సైకిల్లో పాల్గొనడానికి అందుకు అర్హత సాధించడానికి కూడా నేను ప్రయత్నించడం లేదు.
ఆడాల్సిన అవసరం లేదు..
ఇండియాలో ఇప్పుడు చాలా మంది గొప్ప యువ చెస్ ప్లేయర్లు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు తిరిగి ఆడాలి. వారు చాలా బాగా రాణిస్తారని నేను ఆశిస్తున్నాను. వారు నా గైడెన్స్ కోసం సంప్రదించాలనుకుంటే నేను వాళ్లకు అందుబాటులో ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను ఇప్పటికే కొంతమంది భారత జట్టు సభ్యులతో టచ్లో ఉన్నాను. నేను ఇప్పుడు ఉత్సాహభరితమైన గురువుగా ఉండాలనుకుంటున్నాను' అని ఆనంద్ అప్పట్లో వివరణ ఇచ్చాడు.

సత్తా చాటుతున్న భారత జట్లు..
చెస్ ఒలింపియాడ్లో భారత జట్లు అంచనాలకు తగినట్లే సత్తా చాటుతున్నాయి. పతకాలపై ఆశలను పెంచుతున్నాయి. ఆరు రౌండ్లు ముగిసే సరికి మహిళల విభాగంలో భారత్-1 అగ్రస్థానంలో ఉండగా.. ఓపెన్ విభాగంలో భారత్-2 మూడో స్థానంలో ఉంది. టోర్నీ ఇక ముగింపు దిశగా సాగుతోంది. మరో రెండు భారత జట్లు బాగానే ఆరంభించినా.. ఇప్పుడు వెనుకబడ్డాయి. బలంగా పుంజుకోవాల్సివుంది. ఓపెన్ విభాగంలో ప్రజ్ఞానంద, గుకేశ్ వంటి కుర్రాళ్లతో కూడిన భారత్-2 జట్టు అదిరే ప్రదర్శనతో వరుసగా అయిదు రౌండ్లలో గెలిచి అగ్రస్థానంలో కొనసాగింది. కానీ అర్మేనియాతో ఆరో రౌండ్లో ఆ జట్టు విజయపరంపరంపరకు తెరపడింది.

పోటీ మరింత రసవత్తరంగా..
ఈ ఓటమితో జట్టు మూడో స్థానానికి పడిపోయింది. అయితే ప్రతిభావంతులతో కూడిన ఈ జట్టుపై ఇంకా భారీ అంచనాలే ఉన్నాయి. భారత్-2 ఏడో రౌండ్లో క్యూబాను ఢీకొంటుంది. తెలుగు గ్రాండ్మాస్టర్లు హరికృష్ణ, అర్జున్ సభ్యులుగా ఉన్న భారత్-1 ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. ఎలా పుంజుకుంటుందో చూడాలి. భారత్-3 జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. ఇకపై టోర్నీలో పోటీ మరింత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications