
టోక్యో : ప్రపంచం నలమూలల నుంచి వచ్చే అథ్లెట్లు.. అంగరంగ వైభవంగా సాగే వేడుకలు.. అగ్ర రాజ్యం నుంచి ఆకలి రాజ్యం వరకు ఊపిరి బిగపట్టే క్షణాలు.. గెలిస్తే సంబురాలు.. ఓడితే విషాదాలు.. సాంప్రదాయానికి ప్రతీకగా, ఆధునికతకు అద్దం పట్టేలా.. జరిగే విశ్వక్రీడల పండగ..'టోక్యో ఒలింపిక్స్'కు తెరలేసింది. ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు డ్రీమ్ మెడల్.. ఈ రెండింటి మధ్య దేశప్రతిష్ట.. ఆశకు, అగాధానికి మధ్య జరుగుతున్న పోటీలివి.! ఆటగాళ్లలో గెలుపు కాంక్ష తగ్గలేదు. కానీ మనుషుల మధ్య అంతరం వచ్చి చేరింది.! ముఖాన చిరునవ్వు చెదరలేదు. కానీ మాస్క్ రూపంలో చీకటీ కమ్మేస్తోంది.! అభినందనల కౌగిలింతలు లేవు. అప్యాయతల షేక్ హ్యాండ్స్ లేవు. అనుకోకుండా ఆరు ఫీట్ల దూరం అత్యవసరమైంది. కంటికి కనిపించిన శత్రువుతో అతిపెద్ద యుద్ధం చేస్తున్న యావత్ ప్రపంచం.. కాలం పెట్టిన విషమ పరీక్షలో విజేతగా నిలవాలని ఆశ (గేమ్స్ ఆఫ్ హోప్)గా ఎదురు చూస్తోంది. అందుకే మనుషుల మధ్య జరిగే పోటీలతో సరికొత్త ప్రపంచానికి బాటలు వేయడానికి టోక్యో ముస్తాబైంది.
యావత్ క్రీడా ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. టోక్యో ఒలింపిక్స్ ఆరంభోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కరోనా అవంతరాలను ధాటుకొని ఈ విశ్వక్రీడల గంట మోగింది. జపాన్ జాతీయ స్టేడియంలో.. ఈ విశ్వ క్రీడల ముందస్తు కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. అతికొద్దిమంది ప్రముఖుల సమక్షంలో.. జపాన్ చక్రవర్తి నరహిటో విశ్వక్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. జపాన్ సంప్రదాయ నృత్యాలు, పాటలతో ఆరంభ వేడుక హోరెత్తింది. అనంతరం మార్ఛ్ ఫాస్ట్ కార్యక్రమంలో నిర్వహించారు. మార్చ్ ఫాస్ట్లో భారత్ నుంచి దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్, హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించారు. మొత్తం 119 మంది అథ్లెట్లు పాల్గొన్నప్పటికీ.. 20 మంది మాత్రమే మార్చ్ ఫాస్ట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింట్ స్టార్ పీవీ సింధు పాల్గొనలేదు. ఈ మార్చ్పాస్ట్ కార్యక్రమంలో భారత్ 21 క్రమసంఖ్యలో వచ్చింది.
203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. మరోవైపు టోక్యో ఒలింపిక్స్లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ప్రకటించింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది. అలానే టోక్యోలో ఉన్న అథ్లెట్లకి డైలీ అలవెన్సు కింద రూ.3,723 ఇవ్వనున్నారు.