టోక్యో: ఒలింపిక్స్ను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ)తో పాటు ఆతిథ్య జపాన్ దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్కు హాజరయ్యే 15,400 మంది ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ అథ్లెట్స్ సహా మరో 10 వేలమందికి పైగా ఇతర ఆటగాళ్ల భద్రత కోసం నిబంధనలతో కూడిన ఓ ప్లే బుక్ను బుధవారం విడుదల చేసింది. ఇందులో ఆటగాళ్లతో పాటు ఒలింపిక్స్లో భాగమయ్యే ప్రతి ఒక్కరు తు.చ తప్పకుండా పాటించాల్సిన నిబంధనలను పేర్కొన్నాడు.
విశ్వ క్రీడల కోసం టోక్యోకు వచ్చే అథ్లెట్లు తినేటపుడు, తాగేటప్పుడు, పడుకునేటపుడు తప్ప అన్ని వేళలా మాస్కులు ధరించాల్సిందేనని పేర్కొంది. అక్కడి ప్రజా రవాణా వాహనాల్ని కూడా అనుమతి లేకుండా వినియోగించరాదని తెలిపింది. ఆటగాళ్లు గట్టిగా అరవడం, పాడటం కూడా చేయవద్దని పేర్కొంది. ఇలాంటి ఎన్నో కట్టుబాట్లను టోక్యో ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఈ 'ప్లేబుక్'లో పొందుపరిచాయి.
32 పేజీలతో కూడిన ఈ ప్లేబుక్లో ఆటగాళ్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, క్వారంటైన్ కూడా అక్కర్లేదని పేర్కొంది. కానీ ఎప్పటికప్పుడూ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, మాస్క్ను మాత్రం కచ్చితంగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. అభిమానులు అనుమతించే విషయంపై కూడా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. మీడియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అధికారులు... మెగా ఈవెంట్ను విజయవంతం చేసేందుకు అంతా బాధ్యతతో మెలగాలని సూచించారు.
ఆటగాళ్లే కాదు... ఒకవేళ ప్రేక్షకులకు అనుమతి లభించినా వారు కూడా ఇవి పాటించాల్సేందనన్నారు. తమ ఫేవరెట్ అథ్లెట్లకు మద్దతుగా ప్రేక్షకులు అరవడంగానీ పాడటంగానీ చేయడం నిషిద్ధం. కరోనా మహమ్మారి ప్రమాదం పొంచిఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అథ్లెట్లు, సహాయక సిబ్బంది, ఇతర సిబ్బంది, ప్రేక్షకులు అందరూ తమ మార్గదర్శకాలను నిక్కచ్చిగా పాటించాల్సిందేనని కార్యనిర్వాహక కమిటీ తెలిపింది. ఈ మెగా ఈవెంట్ను చూసేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు లేవు. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని కమిటీ స్పష్టం చేసింది. ఒక క్రీడకు చెందిన అథ్లెట్లు మరో క్రీడా పోటీలకు హాజరయ్యేందుకు కూడా అనుమతి లేదు.
జపాన్లో కొంత కాలం నుంచి రోజురోజుకూ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఐఓసీ ఈ ప్లే బుక్ను విడుదల చేసింది. టోక్యో వేదికగా జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో విశ్వ క్రీడల నిర్వహణపై అనుమానాలు నెలకొన్నా.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒలింపిక్స్ను నిర్వహించి తీరుతామని ఇటీవలే జపాన్ ప్రధాని సుగా స్పష్టం చేశారు.