పీవీ సింధు జోరు
భారత బ్యాడ్మింటన్ స్టార్, రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ పీవీ సింధు సెమీఫైనల్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో ఆరో సీడ్ సింధు 21-13, 22-20 తేడాతో నాలుగో సీడ్ , జపాన్ స్టార్ అకానె యమగుచిని వరుస గేముల్లో ఓడించింది. 56 నిమిషాల్లో ప్రత్యర్థిని కంగుతినిపించింది. అయితే సెమీఫైనల్లో తెలుగు తేజం బలమైన ప్రతర్థి వరల్డ్ నెంబర్ 1, తై జూ యింగ్(చైనీస్ తైపీ)తో తలపడనుంది. ఈ ఒక్క అడ్డంకిని ధాటితే సింధు మెడల్ ఖాయం అవుతోంది.
భారత్కు మరో మెడల్..
ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని అందుకోనుంది. శుక్రవారం జరిగిన మహిళల (64-69 కేజీల) వెల్టర్ వెయిట్ క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ 4-1 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చిన్-చెన్ నియోన్ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దాంతో భారత్కు ఓ పతకం ఖాయమైంది. బాక్సింగ్లో సెమీస్లో ఓడిన ఇద్దరికి మెడల్ అందిస్తారు. ఇక మహిళల (57-60) లైట్వెయిట్ ఈ వెంట్లో భారత బాక్సర్ సిమ్రన్జిత్ కౌర్ ఓటమిపాలైంది. థాయ్లాండ్ బాక్సర్ సుడాపొర్న్ సీసొండీ చేతిలో ఓడిన సిమ్రన్జిత్ కౌర్ క్వార్టర్స్కే పరిమితమైంది.
గురి తప్పిన షూటింగ్/ఆర్చరీ
ఆర్చరీలో ఆశలు రేపిన దీపికా కుమారి పోరాటం క్వార్టర్స్లోనే ముగిసింది. మూడోసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్న ప్రపంచ నంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి క్వార్టర్స్లో కనీస పోరాటం లేకుండా కొరియా టాప్సీడ్ యాన్సాన్ చేతిలో 6-0 తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆర్చరీ విభాగంలో భారత్కు మిగిలి ఉన్న ఏకైక ఆశాదీపం దీపిక భర్త అతాను దాస్ మాత్రమే. పురుషుల విభాగంలో అతడు గురువారం ప్రీక్వార్టర్స్లో విజయం సాధించాడు. రెండుసార్లు ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన జిన్ హైక్ను ఓడించి శనివారం జపాన్ అథ్లెట్ తకాహరు ఫురుకవాతో క్వార్టర్స్లో పోటీపడనున్నాడు.
మరోవైపు భారత్ షూటర్లు మనుబాకర్, రహి సర్నోబత్ నిరాశపర్చారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ రెండో అర్హత పోటీల్లో మను 582 స్కోరుతో 15 స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. ఆమె సహచరిణి రహి 32 స్థానానికి పరిమితమైంది.
చక్దే ఇండియా
హాకీ ఈవెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు విజయం సాధించాయి. ముందుగా రాణీరాంపాల్ సేన తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 1-0తో ఐర్లాండ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. భారత్ తరఫున నవ్నీత్(57వ నిమిషం) ఏకైక గోల్ సాధించి విజయాన్నందించింది. మరోవైపు భారత జట్టు క్వార్టర్స్కు వెళ్లాలంటే శనివారం జరిగే పూల్-ఏ విభాగంలో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంది. అలాగే ఐర్లాండ్.. బ్రిటన్ చేతిలో ఓడిపోవాల్సి ఉంది. ఈ రెండూ జరిగితే భారత అమ్మాయిలు క్వార్టర్స్ బెర్త్ సొంతం చేసుకుంటారు.
భారత పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. శుక్రవారం పూల్-ఏ విభాగంలో జపాన్తో తలపడిన భారత్ 5-3 తేడాతో మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాంతో పూల్-ఏలో టీమిండియా.. ఆస్ట్రేలియా తర్వాత నాలుగు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. భారత్ తరఫున గుర్జంత్ సింగ్(17, 56 వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. హర్మన్ప్రీత్ సింగ్(13వ నిమిషం), శంషర్ సింగ్(34వ నిమిషం), నీలకంఠ శర్మ(51వ నిమిషం)చెరొక గోల్ నమోదు చేశారు.
అథ్లెటిక్స్లో నిరాశే..
ఎన్నో అంచనాల నడుమ ఒలింపిక్స్లో అడుగుపెట్టిన స్ప్రింటర్ ద్యుతి చంద్ తీవ్రంగా నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన 100మీటర్ల అర్హత పోటీల్లో ద్యుతి హీట్ 5లో ఏడో స్థానంలో.. ఓవరాల్గా 45 స్థానంలో నిలిచింది. అయితే 200మీటర్ల రేసులోనూ ఆమె పోటీ పడనుంది. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో భారత అథ్లెట్ అవినాష్ ముకుంద్ సబ్లె.. ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయాడు. ఈవెంట్ హీట్-2లో అవినాష్ సబ్లె 8:18:12 టైమింగ్తో ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డల్స్ రౌండ్1 హీట్స్ 5లో జబీర్ 50.77 సెకన్ల టైమింగ్తో ఆఖరి స్థానంలో నిలిచి ముందంజ వేయలేకపోయాడు. 4X100మీటర్ల రిలే మిక్స్డ్ రౌండ్1-హీట్2లో భారత టీమ్ రేవతి వీరమణి, సుభా వెంకటేశన్, అలెక్స్ ఆంటోనీ, సర్తక్ బాంబ్రీ 8వ స్థానంలో నిలిచి ముందంజ వేయలేకపోయారు. సెయిలింగ్, రోయింగ్, గోల్ఫ్, ఈక్వెస్ట్రెయిన్ ఈవెంట్స్లో కూడా భారత్కు నిరాశే ఎదురైంది.