టోక్యో : ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020 గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో పారాలింపిక్స్కు రంగం సిద్దమైంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగానే ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు దివ్యాంగుల విశ్వక్రీడలు జరగనున్నాయి. అయితే టోక్యో నగర పరిధిలోని పారా ఒలింపిక్ గ్రామంలో కరోనా కలకలం రేగింది. గురువారం మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. పారాఒలింపిక్స్ పోటీలు ప్రారంభానికి ముందు పారా ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఒక కరోనా కేసు వెలుగుచూడటం నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తోంది. పారాఒలింపిక్ పోటీలకు ముందు జపాన్ దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. జపాన్ దేశంలో నివసిస్తున్న కాంట్రాక్టర్లు, గేమ్స్ స్టాఫ్లో 74 మంది కరోనా బారిన పడ్డారు. క్రీడాకారుల శిక్షణ శిబిరాల్లో మరో 6 కరోనా కేసులు వెలుగుచూశాయి. కాని పారా ఒలింపిక్ క్రీడా గ్రామంలో మొట్టమొదటి సారి కరోనా పాజిటివ్ కేసు బయటపడింది.
భారత్ నుంచి మొత్తం 54 మంది పారా అథ్లెట్లు పోటీ పడుతున్నారు. వారిలో హైజంపర్ మరియప్పన్ తంగవేలు, జావెలిన్ త్రోయర్ టిక్ చాంద్, డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్ సహా ఎనిమిది మంది న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధ వారం టోక్యో పయనమయ్యారు. తొలిసారిగా బ్యాడ్మింటన్, తైక్వాండోను ఈ పారాలింపిక్స్లో ప్రవేశ పెడుతున్నారు. ఐదేళ్ల క్రితం రియో పారా లింపిక్స్లో 19 మంది మాత్రమే దేశం నుంచి ప్రాతినిథ్యం వహించగా, ఈ సారి మన అథ్లెట్ల సంఖ్య దాదాపు మూడురెట్లు పెరిగింది. ఇప్పటివరకు పారాలింపిక్స్లో 12 పతకాలు సాధించిన భారత్.. అత్యధికంగా రియోలో 4 పతకాలు (2 స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం) దక్కించుకుంది.
కెరీర్లో మూడో ఒలింపిక్స్లో పాల్గొంటున్న జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జజారియా ఎఫ్-46 విభాగంలో తలపడుతున్నాడు. ఇప్పటిదాకా విశ్వక్రీడల్లో రెండు స్వర్ణాలు సాధించిన దేవేంద్ర.. రియోలో 63.97 మీటర్ల దూరం విసిరి చాంపియన్గా నిలిచాడు. అయితే, తాజాగా జరిగిన ఒలింపిక్స్ అర్హత పోటీల్లో జావెలిన్ను 65.17 మీ. దూరం విసిరిన దేవేంద్ర తన గత రికార్డును బద్దలుకొట్టి టోక్యోలోనూ పసిడి వేటలో హాట్ ఫేవరెట్గా నిలిచాడు. హైజంప్ టీ42 విభాగంలో మరియప్పన్, టీ63 కేటగిరీలో వరుణ్సింగ్ పతకాలు కొల్లగొడతారన్న అంచనాలు ఉన్నాయి. రియోలో ఇవే విభాగాల్లో మరియప్పన్ స్వర్ణంతో, వరుణ్ కాంస్యంతో మెరిశారు. వీరితో పాటు జావెలిన్ త్రోయర్ సందీప్, ఆర్చరీలో హర్విందర్ సింగ్, వివేక్, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో ప్రమోద్ భగత్, పవర్ లిఫ్టింగ్లో పురుషుల 65 కిలోల విభాగంలో జైదీప్ దేశ్వాల్, మహిళల 50 కిలోల కేటగిరిలో సకినా ఖాటున్, షూటింగ్లో 19 ఏళ్ల మనీష్ నర్వాల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.
రియోలో స్వర్ణం గెలిచిన మరియప్పన్ టోక్యోలో భారత పతకధారిగా ఎంపికయ్యాడు. ఈసారి మొత్తం 9 క్రీడాంశాల్లో భారత పారా అథ్లెట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నారు. ఈనెల 25న జరగనున్న మహిళల టేబుల్ టెన్నిస్ ఈవెంట్తో భారత పతక వేట ప్రారంభమవనుంది. టీటీ సింగిల్స్ సీ3లో సోనాల్బెన్ ముధూభాయ్, సీ4లో భవీనా హస్ముక్భాయ్ పటేల్ పోటీలతో ఒలింపిక్స్లో భారత సంగ్రామం మొదలుకానుంది.