హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అథ్లెట్లకు ధ్యాన రింగ్స్ అందించనున్నారు. ఓ వ్యక్తి ఎంత సేపు కచ్చితంగా మెడిటేషన్లో ఉన్నారనే అంశాన్ని ధ్యాన రింగ్స్ లెక్కించి చెబుతాయి. ఈ ఎలాక్ట్రానిక్ గాడ్జెట్ హార్ట్ బీట్స్, బ్రీతింగ్, ఫోకస్, రిలాక్సేషన్ అంశాల ఆధారంగా రేటింగ్ ఇస్తుంది. ఒలింపిక్స్ వెళ్లే క్రీడాకారుల మానసిక ఆరోగ్యం కోసం భారత బ్యాడ్మింటన్ హెడ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మార్గనిర్దేశనంలోని 'ధ్యాన'తో భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) చేతులు కలిపింది.
ఒలింపిక్స్లో భారత క్రీడాకారులకు ధ్యాన అధికారిక మెడిటేషన్ భాగస్వామిగా వ్యవహరించనుంది. ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీలో క్రీడాకారులు, కోచ్లు, సహాయ సిబ్బంది ఒత్తిడిని అధిగమించేందుకు ఈ ధ్యాన పరికరం సహాయ పడనుంది. ఒలింపిక్స్లో పాల్గొనే ప్రతి ఒక్కరి కోసం మెడిటేషన్ ఉంగరాలు, కిట్లను ఐఓఏ తీసుకుంది. ఇప్పటికే ఈ ధ్యాన రింగ్స్ను గోపిచంద్ అకాడమీలో ఉపయోగిస్తున్నారు. దీని సాయంతో స్టూడెంట్స్ తమ గోల్ దిశగా నడిచేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఇవే రింగ్స్ను టోక్యో వెళుతున్న మన అథ్లెట్లకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అందజేయనుంది.
ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో క్రీడాకారుల మానసిక ఆరోగ్యం.. ఏకాగ్రత మెరుగుపరచడం కోసమే ధ్యానతో చేతులు కలిపినట్లు ఐఓఏ ప్రకటించింది. ''అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్లో కఠినమైన సవాళ్లు ఎదురవ్వొచ్చు. ఆటగాడిగా, కోచ్గా ధ్యానంతో ఎన్నో ప్రయోజనాలు పొందాను. మెడిటేషన్ తీవ్రతను పక్కాగా తెలియజేయడం ద్వారా టోక్యోలో భారత బృందానికి ధ్యాన ఎంతగానో ఉపయోపడుతుంది'' అని గోపీచంద్ తెలిపాడు. ఒలింపిక్స్ గేమ్స్లో మెడిటేషన్ పార్టనర్ను నియమించుకున్న తొలి దేశంగా భారత్ నిలిచింది.