న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ను కావాలనే ఇరికించారని, దీని వెనక పెద్ద కుట్ర ఉందని అతని తరఫు లాయర్ బీఎస్ జాఖర్ అన్నారు. ఈ హత్యకేసు మొత్తం ఎపిసోడ్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై తమకు పలు అనుమానాలున్నాయని చెప్పారు. సుశీల్ నేరం చేశాడనేందుకు వీడియో ఫుటేజ్ ఆధారమని చెబుతున్నారని, కానీ పోలీసులు చూపుతున్న ఫుటేజ్లో సుశీల్ జాడలేదని జాఖర్ వెల్లడించారు. పోలీసు దర్యాప్తు జరుగుతున్న తీరును ప్రశ్నించిన ఆయన, సుశీల్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, తాము చెప్పదల్చుకున్న అన్ని విషయాలను ఇప్పటికే కోర్టు ముందు ఉంచినట్లు స్పష్టం చేశారు.
'పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోనే తప్పులు ఉన్నాయి. ఘటన గురించి తెలిశాక ఛత్రశాల్ స్టేడియానికి వెళ్లి గాయపడిన ముగ్గురి స్టేట్మెంట్ రికార్డు చేయగా వారెవరూ సుశీల్ దాడి చేసినట్లుగా చెప్పలేదు. కానీ సాగర్ చనిపోయాక మాత్రమే కిడ్నాపింగ్, మర్డర్ కేసు పెట్టారు. సుశీల్ కొట్టినట్లుగా చెబుతున్న వీడియోను అందరి ముందు బహిర్గతపర్చవచ్చు కదా. విచారణకు హాజరయ్యేందుకు నోటీసు కూడా సుశీల్ పేరిట కాకుండా అతని భార్య పేరిట పంపించడం నిబంధనలకు విరుద్ధం. ఇదంతా చూస్తుంటే సుశీల్పై కావాలనే కుట్ర చేసినట్లు అర్థమవుతోంది' అని జాఖర్ వివరించారు.
అంతేకాక సుశీల్పై పది రోజుల్లోపే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారని, పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ విషయంలో కూడా ఎప్పుడూ ఇలా జరగలేదని జాఖర్ చెప్పారు. దీన్ని బట్టి ఈ కేసులో సుశీల్ను ఇరికించడంలో పోలీసులు అత్యుత్సాహాన్ని అర్థం చేసుకోవ్చన్నారు. అయితే తప్పుచేయని సుశీల్ 10 రోజులు ఎందుకు పరారీలో ఉన్నాడనే ప్రశ్నకు జాఖర్ బదులివ్వలేదు.
హత్యకేసులో కటకటాలపాలైన రెజ్లర్ సుశీల్ కుమార్ అంశంపై ఇండియన్ ఒలింపిక్ సంఘం(ఐఓఏ)ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా స్పందించారు. తనకు తెలిసినంతవరకు సుశీల్ మర్యాదస్తుడన్నారు. 'సుశీల్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. నాకు తెలిసినంతవరకు సుశీల్ చాలా నెమ్మదస్తుడు. అందరితో మర్యాదగా నడుచుకుంటాడు. కానీ ప్రస్తుతం అతనిపై నడుస్తున్న కేసు గురించి నాకు అవగాహన లేదు. పోలీస్ విచారణ తర్వాత నిజం తెలుస్తుంది. కానీ, నాకు తెలిసిన సుశీల్ అయితే మంచి మనిషే'అని బాత్రా పేర్కొన్నారు.