
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ 2021 బరిలో నిలిచిన భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇక యావత్ క్రీడా ప్రపంచం ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూసిన.. టోక్యో ఒలింపిక్స్ శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా ఆటంకాలను ధాటుకొని ఈ విశ్వక్రీడల గంట మోగింది. జపాన్ జాతీయ స్టేడియంలో.. ఈ సమ్మర్ గేమ్స్ ముందస్తు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ ఆరంభ వేడుకులను టీవీలో వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ భారత క్రీడాకారులు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్ట్ విషెస్ తెలియజేశారు. అంతేకాకుండా భారత ఆటగాళ్లకు అండగా నిలవాలని దేశ ప్రజానికానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన చీర్ ఫర్ ఇండియా అంటూ ట్వీట్ చేశారు. ఒలింపిక్స్ ఆరంభం వేడుకులను టీవీలో చూస్తున్న ఫొటోను సైతం పంచుకున్నారు.
అతికొద్దిమంది ప్రముఖుల సమక్షంలో.. జపాన్ చక్రవర్తి నరహిటో విశ్వక్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. జపాన్ సంప్రదాయ నృత్యాలు, పాటలతో ఆరంభ వేడుక హోరెత్తింది. అనంతరం మార్ఛ్ ఫాస్ట్ కార్యక్రమంలో నిర్వహించారు. మార్చ్ ఫాస్ట్లో భారత్ నుంచి దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్, హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించారు. భారత్ నుంచి మొత్తం 119 మంది అథ్లెట్లు పాల్గొంటున్నప్పటికీ.. 20 మంది మాత్రమే మార్చ్ ఫాస్ట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింట్ స్టార్ పీవీ సింధు పాల్గొనలేదు. ఈ మార్చ్పాస్ట్ కార్యక్రమంలో భారత్ 21 క్రమసంఖ్యలో వచ్చింది.

203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి.