న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన అథ్లెట్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. విశ్వక్రీడల్లో మెడల్స్ సాధించి.. యావత్ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ.. అనంతరం జాతినుద్దేశించి ప్రసగించారు. అథ్లెట్లు పతకాలు సాధించి.. నవ యువ భారతావనిలో స్ఫూర్తి నింపారని, దేశ ప్రతిష్టను పెంచారని ప్రశంసించారు. వారికి దేశం మొత్తం గౌరవం ప్రకటిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో భారత ఒలింపిక్స్ బృందానికి సెల్యూట్ చేశారు. ఎర్రకోటకు హాజరైన అతిథులు కూడా చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు.
ఎర్రకోటపై జరిగిన వేడుకలకు జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా, వెయిట్ లిప్టింగ్లో రజతం సాధించిన మీరాబాయి, బ్యాడ్మింటన్లో కాంస్యం అందుకున్న పీవీ సింధుతోపాటు ఒలింపిక్స్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 32మంది ఈ వేడుకలకు హాజరయ్యారు. వీరితోపాటు ఇద్దరు (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సాయ్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. 'ఇంతకుముందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టీవీలో చూసేవాణ్ని. ఇప్పుడు ఆ వేడుకలకు ప్రత్యక్షంగా హాజరయ్యా. ఇది నాకు కొత్త అనుభూతి. విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం మన దేశం చాలా ఏళ్లుగా సాధించలేదు. నా వల్ల దేశం గర్వపడే విధంగా పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది' అని అన్నాడు.
అంతకుముందు టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులంతా అద్భుత ప్రదర్శన కనబర్చారని... వారిని చూసి దేశమంతా గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. ఇకపై ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొనేలా, వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించేలా మన ఆటగాళ్లంతా స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారులతో ముచ్చటించారు.
ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, రవి దహియా, మీరాబాయి చాను, బజరంగ్ పునియా, పీవీ సింధు, లవ్లీనా బొర్గోహైన్ల తోపాటు కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు, ఇతర క్రీడాకారులు, కోచ్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా, నితీశ్ ప్రామాణిక్, ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు నరీందర్ బత్రా, రాజీవ్ మెహతా కూడా పాల్గొన్నారు.
ఇక, ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో భారత్ ఏడు పతకాలు సాధించింది. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు క్యాంస పతకాలున్నాయి. భారత్కు ఒలింపిక్స్లో ఇన్ని పతకాలు రావడం ఇదే తొలిసారి.