న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు వాడిన క్రీడా పరికరాల వేలానికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతుల ఈ- వేలం ప్రక్రియ శుక్రవారం మొదలైంది. టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ అథ్లెట్లు ఆయన కలిసినపుడు వాళ్లు తమ క్రీడా వస్తువులను.. మోదీకి బహుమతిగా అందించారు. టోక్యో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్ సింధుతోపాటు మరో 13 మంది ప్లేయర్లు.. స్వచ్ఛంద కార్యక్రమాల విరాళాల సేకరణ కోసం ఆటోగ్రాఫ్ చేసిన తమతమ ఆట వస్తువులు, జెర్సీలను మోదీకి బహుమతిగా ఇచ్చిన వారిలో ఉన్నారు. ఇప్పుడు ఆటగాళ్ల వస్తువులకు వేలంలో భారీ ధర పలుకుతోంది.
ఫెన్సర్ భవానీ దేవి కత్తి బిడ్ ధర రూ.10 కోట్లను దాటింది. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్లో స్వర్ణం గెలిచిన కృష్ణ నాగర్, రజతం గెలిచిన సుహాస్ రాకెట్ల బిడ్ కూడా రూ.10 కోట్లకు చేరింది. నీరజ్ చోప్రా ఈటె వేలంలో రూ.1.55 కోట్లతో కొనసాగుతోంది. పీవీ సింధు రాకెట్ బిడ్ రూ.90 లక్షలు దాటింది. బాక్సర్ లవ్లీనా గ్లౌవ్స్కు బిడ్ రూ.1.92 కోట్లుగా ఉంది. వచ్చే నెల 7 వరకు ఈ వేలం కొనసాగుతుంది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని గంగా నది పరిశుభ్రతకు నిర్దేశించిన ప్రాజెక్ట్ 'నమామి గంగే' కోసం వినియోగించనున్నారు.
టోక్యో ఒలింపిక్స్ 2020 ఆరంభం నుంచి ముగిసేవరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అయ్యారు. టోర్నీ ఆరంభానికి ముందు భారత అథ్లెట్లతో సమావేశమై వారిలో స్ఫూర్తి నింపారు. ఒక్కో అథ్లెట్ పతకం సాదిస్తుంటే.. వారిని అభినందించారు. ఇక పతకాలతో తిరిగొచ్చాక వారి ఆటతీరును ఆకాశానికెత్తేశారు. ఆగస్టు 16న టోక్యో ఒలింపిక్స్ 2020 క్రీడాకారులకు ప్రధాని మోదీ తన నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రతి అథ్లెట్లతో ప్రధాని ప్రత్యేకంగా ముచ్చటించారు. చాలా సమయం ఆటగాళ్లతో గడిపారు. పతకాలు తెచ్చిన వారినే కాకుండా అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన వారిని, మెగా క్రీడల్లో ఆడిన అథ్లెట్లను ఆయన అభినందించారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం షట్లర్ పీవీ సింధుకు ఐస్క్రీం, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు చుర్మా తినిపించారు.
విందు సమయంలో నీరజ్ చోప్రా తన బళ్లెం ప్రధాని మోదీకి చూపించాడు. 'నువ్వు దీనిపై సంతకం చేశావు. నేను దీన్ని వేలం వేస్తాను. నీకు ఎలాంటి అభ్యన్తరం లేదుగా?' అని ప్రధాని అతడితో అన్నారు. దాంతో చిరునవ్వుతో నీరజ్ తన జావెలిన్ను మోదీకి బహూకరించాడు. ఆ తర్వాత పీవీ సింధు తన రాకెట్ను ప్రధానికి ఇచ్చింది. బాక్సర్ లవ్లీనా నుంచి ప్రధాని బాక్సింగ్ గ్లోవ్స్ తీసుకున్నారు. ఆపై మోదీ ఓ జోక్ చేశారు. 'నేనిప్పుడు వీటిని తీసుకున్నా కదా?. మోదీ తమనేమో చేయబోతున్నారని రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటారు' అని మోదీ సరదాగా అన్నారు. ఇవి మాత్రమే కాకుండా మిగతా క్రీడాకారుల నుంచీ ఆయన మరొకొన్ని వస్తువులను కూడా తీసుకుని వేలంలో ఉంచారు.