న్యూఢిల్లీ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. సౌతాఫ్రికాలో జరుగుతున్న 'ది అథ్లెటిక్ సెంట్రల్ నార్త్ ఈస్ట్ మీటింగ్' టోర్నీలో మంగళవారం అద్భుత ప్రదర్శన కనబర్చిన నీరజ్.. ఒలింపిక్ బెర్త్ను దక్కించుకున్నాడు.
ఇక జావెలిన్ను 87.86 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. ఒలింపిక్ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాడు. ఒలంపిక్స్లో అర్హత సాధించాలంటే కనీసం 85 మీటర్లు విసరాలి. దాన్ని దాటి నీరజ్ జావెలిన్ను విసిరాడు. మరోవైపు ఈ టోర్నీకి ఒలింపిక్ సంఘం గుర్తింపు ఉందని భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) స్పష్టం చేసింది.
మోచేతి గాయంతో గత సీజన్ మొత్తానికి దూరమైన నీరజ్.. పునరాగమనంలో సత్తాచాటాడు. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన టోర్నీలోనే రాణించి ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. 'ఒలంపిక్స్ అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి మూడు ప్రయత్నాల్లో త్రోలను 80 మీటర్లకు పైనే విసిరాను. ఇంకొంచెం కష్టపడాలని నిర్ణయించుకొని నాల్గవ ప్రయత్నంలో గట్టిగా విసిరాను. అది 87 మీటర్లకు చేరింది 'అని నీరజ్ తెలిపాడు. ఈ అర్హత పోటీల్లో మరో ఇండియన్ ప్లేయర్ రోహిత్ యాదవ్ 77.61 మీటర్లు విసిరి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయాడు.
మరోవైపు నీరజ్ చోప్రా చివరిసారిగా 2018 ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. ఇండోనేసియా రాజధాని జకార్తలో జరిగిన ఈ టోర్నీలో జావెలిన్ను 88.06 మీటర్ల దూరం విసిర గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. అప్పట్లో అది జాతీయ రికార్డు కూడా కావడం విశేషం. ఆ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. ఒలింపిక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరుగనున్నాయి.