న్యూయార్క్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ వేసుకున్న బూట్లు వేలంలో రికార్డు ధర పలికాయి. 1985లో ఇటలీ వేదికగా జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్లో జోర్డాన్ వేసుకున్న 'ఎయిర్ జోర్డాన్ వన్ హైస్ స్నీకర్స్' బూట్లకు సుమారు రూ. 4.60 కోట్లు (6 లక్షల 15 వేల అమెరికన్ డాలర్లు) లభించాయి. దాంతో గత మేలో ఇవే రకానికి చెందిన జోర్డాన్ బూట్లకు పలికిన సుమారు రూ. 4.20 కోట్లు(5 లక్షల 60 వేల అమెరికన్ డాలర్లు ) ఆల్టైమ్ రికార్డును బద్దలు అయిందని వేలం నిర్వహించిన క్రిస్టీ సంస్థ ప్రకటించింది.
అయితే ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ వెల్లడించడానికి ఇష్టపడలేదు. నేషనల్ బాస్కెట్బాల్ సంఘం (ఎన్బీఏ) టోర్నీలో మకుటం లేని మహారాజుగా నిలిచిన మైకేల్ జోర్డాన్... తనకే సాధ్యమైన ప్రత్యేక ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. చికాగో బుల్స్కు ప్రాతినిధ్యం వహించిన జోర్డాన్... తన జట్టు జెర్సీ కలర్ అయిన నలుపు, ఎరుపు రంగులతో కూడిన బూట్లను వాడేవాడు.
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ను ఓ శ్వేతజాతి పోలీస్ అత్యంత కర్కశంగా హత్య చేసిన ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి మద్దుతు ప్రకటించిన జోర్డాన్.. వర్ణ సమానత్వం, సామాజిక న్యాయం కోసం పోరాడుతోన్న సంస్థలకు 10 కోట్ల డాలర్ల (రూ. 755 కోట్లు) విరాళాన్ని ప్రకటించాడు.
ఇందులో 4 కోట్ల డాలర్లు (రూ. 302 కోట్లు) 'నైకీ' రూపొందించిన 'జోర్డాన్ బ్రాండ్'తరపున అందజేస్తామన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
'వివక్ష లేకుండా జాతి సమానత్వం, సామాజిక న్యాయం, విద్యావకాశాలు అనే లక్ష్యాల్ని నెరవేర్చడం కోసం 10 సంవత్సరాలకు పైగా ధనాన్ని సమకూర్చుతాం. 'నల్లజాతి వారి ప్రాణాలూ ప్రధానమే'. దేశంలో వేళ్లూనుకుపోయిన జాత్యాహంకారం నశించేవరకు, నల్లజాతీయుల జీవితాలను మెరుగుపరిచేందుకు వారిని రక్షించేందుకు మేం కట్టుబడి ఉంటాం' అని అప్పట్లో జోర్డాన్ పేర్కొన్నాడు.