ఉసేన్ బోల్ట్ దొరికాడంటూ..
కర్ణాటక సంప్రదాయక క్రీడ కంబళ పోటీల్లో బోల్ట్ కన్నా వేగంగా 100 మీ. దూరాన్ని 9.55 సెకన్లలోనే పూర్తిచేసిన శ్రీనివాస్ గౌడ (కర్ణాటక), కాళ్లకు బూట్లు లేకుండా రోడ్డుపై 100మీ.ల దూరాన్ని 11 సెకన్లలోనే పూర్తి చేసిన మధ్యప్రదేశ్కు చెందిన రామేశ్వర్ గుర్జార్లకు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ దక్కిన విషయం తెలిసిందే. భారత్కు మరో ఉసేన్ బోల్ట్ దొరికాడంటూ నెట్టిళ్లు కోడై కూసింది. అప్పట్లో దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వారికి ట్రయల్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. అవసరమైతే శిక్షణ కూడా ఇస్తామన్నారు. తాజాగా ఈ వ్యవహారంపై కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. పరుగు వీరులు ఇద్దరిలో ఒకరు ట్రయల్స్ పాల్గొని విఫలమవ్వగా.. మరొకరు రాలేదన్నారు.
అవగాహన లేకుండా మాట్లాడారు..
‘గుర్జార్ పరుగెత్తుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అప్పుడు నేను స్పందించకుండా ఉంటే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించేవారు. అతనికి ట్రయల్స్ నిర్వహించగా గుర్జార్ అతికష్టమ్మీద 12.9 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తిచేశాడు. ట్రయల్స్లో జూని యర్లతోనే పోటీపడలేకపోయాడు. అతని వయస్సు 26 ఏళ్లు కాబట్టి ఇప్పుడు అతనికి కొత్తగా శిక్షణ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. కానీ ప్రజలకు తెలియదు కదా. అందుకే ట్రయల్స్ నిర్వహించాం. అంతర్జాతీయ స్ప్రింట్ ప్రమాణాలపై సరైన అవగాహన లేకుండానే అతను బోల్ట్ను మించగలడంటూ దేశమంతా నమ్మింది'అంటూ రిజిజు అన్నారు.
ఆటంటే క్రికెట్ ఒక్కటే కాదు..
దేశంలో క్రీడల గురించి ఏమాత్రం అవగాహన లేనివారు కూ డా ఇష్టారీతిన మాట్లాడడం అలవాటైపోయిందని క్రీడా మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వెలుగు చూసిన వీడియోల ను పోస్ట్ చేస్తూ, వారికి తోడ్పాటు అం దించడం లేదని నిందిస్తుంటారని అ న్నారు. దేశంలో చాలామందికి క్రికెట్ గురించి తప్ప ఇతర క్రీడలపై ఏమా త్రం పరిజ్ఞానం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘నాలుగు నెలల క్రితం కూడా కర్ణాటకలో జరిగిన బుల్ రేస్లో బోల్ట్ రికార్డు బద్దలైందని వార్తలు వినిపించాయి. ప్రొఫెషనల్ వ్యక్తులతోపాటు పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు కూడా శ్రీనివాస గౌడను ఒలింపిక్స్కు పంపితే 100మీ. రేసులో స్వర్ణం సాధిస్తాడని చెప్పారు. అసలు వీరందరికీ ఏమా త్రం క్రీడా పరిజ్ఞానం ఉండదు. దీనికి తోడు నేను స్పందించకపోతే క్రీడా మంత్రి సైలెంట్గా ఉన్నాడని ఆరోపిస్తారు.
నన్ను నేను నిరూపించుకోవాల్సి వస్తుంది..
ఇలాంటి వారందరి కోసం నన్ను నేను నిరూపించుకోవాల్సి వస్తుంది. అందుకే వారిద్దరినీ ట్రయల్స్కు పిలిపించాను. గౌడ ఇప్పటికీ రాలేదు. అలాగే దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం లేదని నాకు ఫిర్యాదు చేస్తుంటారు. నిజానికి మన దేశంలో ఆటలపై చాలా తక్కువ పరిజ్ఞానం ఉంది. ఇక్కడి ప్రజలకు క్రికెట్ గురించి మాత్రమే తెలుసు. ఇతర ఆటల గురించి ఏమాత్రం పట్టించుకోరు' అని మంత్రి రిజుజు ఆవేదన వ్యక్తం చేశారు.