బెంగళూరు: ఇండియన్ ఉసేన్ బోల్ట్గా గుర్తింపు పొందిన కంబళ వీరుడు శ్రీనివాస గౌడ గుర్తున్నాడా? గతేడాది జమైకా పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ ఆల్టైమ్ 100 మీటర్ల పరుగు రికార్డు 9.58 సెకన్లను బ్రేక్ చేశాడని ఈ శ్రీనివాసుడిని యావత్ భారతం కొనియాడింది. కంబాల పోటీలో అతను తన దున్నలతో 142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో పూర్తి చేశాడని, ఈ లెక్కన 100 మీటర్ల దూరాన్ని శ్రీనివాస్ 9.55 సెకన్లలో పరుగెత్తాడని కీర్తించింది. ఈ అభినవ బోల్ట్ను ఒలింపిక్స్కు సిద్దం చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఆ సాయ్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆహ్వానాన్ని అతను తిరస్కరించాడనుకోండి. కానీ ఇప్పుడు ఈ భారత్ బోల్ట్ మరో రికార్డు నెలకొల్పాడు.
తాజాగా 8.78 సెకన్లలోనే 100 మీటర్ల పరుగును పూర్తిచేసి తన రికార్డును తానే తిరగరాశాడు. ఆదివారం కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా పరిధి కక్యపడవ గ్రామంలో మైరాసత్య సంస్థ నిర్వహించిన 125 మీటర్ల పరుగును 11.21 సెకన్లలోనే పూర్తిచేయగా దాన్ని 100 మీటర్లకు లెక్కగట్టి 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. గతవారమే వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబళ పోటీల్లో 100 మీటర్ల రేసును 8.96 సెకన్లలో పూర్తిచేశాడు శ్రీనివాస గౌడ. వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలుకొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు.
కంబాల అనేది దక్షిణ కన్నడ, ఉడుపి, తుళునాడు తీర ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. కంబాల ఆటలో ఎద్దుల పోటీదారుడు (బఫెలో జాకీ) బురద నీటిలో పరుగెడ్తాడు. ఎవరైతే ఎద్దులను వేగంగా పరుగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతగా నిలుస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రీడా ఎప్పటినుంచో ఉంది.