న్యూఢిల్లీ: వరల్డ్ బెస్ట్ స్ప్రింటర్, జమైకా పరుగులు వీరుడు ఉసేన్ బోల్ట్ భారీ ఆర్థిక మోసానికి గురయ్యాడు. అతని ఖాతా నుంచి దాదాపు రూ.103 కోట్లు (12.7 మిలియన్ డాలర్లు) మాయమైనట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేటు పెట్టుబడుల సంస్థలో బోల్డ్ పెట్టుబడిగా ఈ డబ్బులను ఉంచగా.. ఆ సంస్థకు చెందిన ఉద్యోగి భారీ స్కామ్ చేసినట్లు సమాచారం. జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఎస్ఎస్ఎల్) సంస్థలో బోల్ట్ కొన్నేళ్ల కిందట ఓ పెట్టుబడి ఖాతా తెరిచాడని, రిటైర్మెంట్, లైఫ్టైం సేవింగ్స్లో భాగంగా ఈ ఖాతాను కొనసాగిస్తున్నాడని అతని న్యాయవాది మీడియాకు తెలిపారు.
ఈ ఖాతాలో ఉసేన్ బోల్ట్కు 12.8 మిలియన్ డాలర్లు ఉండగా.. జనవరి రెండో వారం నాటికి కేవలం 12000 డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే చూపించిందని సదరు న్యాయవాది వెల్లడించారు. కంపెనీలో జరిగిన మోసపూరిత చర్య వల్ల డబ్బులు మాయమైనట్లు ఆరోపించారు. పది రోజుల్లోగా ఆ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీకి నోటీసులు పంపించినట్లు తెలిపారు.
ఇక ఈ మోసాన్ని ఈ నెల ఆరంభంలోనే గుర్తించినట్లు స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కంపెని ఓ ప్రకటనలో తెలిపింది. ఓ మాజీ ఉద్యోగి మోసపూరిత కార్యకలాపాల కారణంగా తమ క్లయింట్స్ ఖాతాల్లో నుంచి మిలియన్ డాలర్ల మొత్తం మాయమైనట్లు జనవరి 12న కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉసేన్ బోల్ట్ సహా దాదాపు 30 మంది ఖాతాదారులు నుంచి సదరు వ్యక్తి డబ్బులు కొట్టేసినట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకొనేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇక ఈ ఘటనపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అధికారులను సూచించారు. ఘటన నేపథ్యంలో ఎస్ఎస్ఎల్ కంపెనీపై చర్యలు చేపట్టారు. కంపెనీ మేనేజ్మెంట్ బాధ్యతలను తాత్కాలికంగా ప్రభుత్వ అధికారులు చేతుల్లోకి తీసుకున్నారు. 2008, 2012, 2016 ఒలింపిక్స్ పరుగుల పోటీల్లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన బోల్ట్ .. 2017లో అథ్లెటిక్స్కు గుడ్బై చెప్పాడు.