
రోమ్: కరోనా వైరస్ సోకి ఇటలీ మాజీ క్రీడాకారుడు డొనటో సబియ(56) మృతి చెందాడు. ఈ విషయాన్ని ఇటాలియన్ ఒలింపిక్ కమిటీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. మాజీ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ అయిన సబియను ఇటీవలే సౌతెర్న్ ఇటాలియన్ రిజియన్, సాన్ కర్లో ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్లో ఉంచి చికిత్స అందించారని పేర్కొంది. ఇక కరోనా కారణంగా మరణించిన తొలి ఒలింపిక్ క్రీడాకారుడు డొనటో సబియనేనని ఇటాలియన్ ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది. సబియా 1984, 1988 ఒలింపిక్స్లో 800 మీటర్ల ఈవెంట్లో ఫైనల్ చేరాడు. 1984లో ఐదు స్థానంతో సరిపెట్టుకున్న సబియా.. 1988లో ఏడో స్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో 1984లో జరిగిన యూరోపియన్ ఇండోర్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించాడు.
సబియా మృతి పట్ల ఇటాలియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అద్భతమైన ప్రతిభ గల ఆటగాడు ఇలా మరణించడం తమని తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితమే సబియా తండ్రి కూడా కరోనా వైరస్ సోకే మరణించాడు. ఇక కరోనా కారణంగా ఇటలీ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ప్రాణాంతక మహమ్మారి 135,586 మందికి సోకగా 17,127 మంది మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఇటలీలోనే మరణించారు.