లా ప్రాక్టీస్:
బీటెక్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన అభిషేక్కు సైబర్ క్రైమ్స్కు సంబంధించిన కేసులపై ప్రత్యేక ఆసక్తి ఉంది. ప్రపంచకప్లో రెండు స్వర్ణాలు సాధించిన 30ఏళ్ల హరియాణా షూటర్ కొన్నాళ్లపాటు షూటింగ్, లా ప్రాక్టీస్కు సమప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు. అటు షూటర్గా, ఇటు లాయర్గా రెండు వృత్తుల మధ్య సమతూకం పాటిస్తూ ముందుకు సాగుతానని అభిషేక్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
క్రిమినల్ కేసులను వాదిస్తా
'నిజానికి ఒలింపిక్స్ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాలనుకున్నా. కానీ ఆ గేమ్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఇప్పటికే టోక్యో విశ్వక్రీడలకు అర్హత సాధించా. కానీ వాటికి చాలా సమయముంది. ఈలోపు లాయర్గా మరోసారి నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నా. సైబర్ క్రైమ్స్తో పాటు క్రిమినల్ కేసులను కూడా వాదిస్తా' అని ప్రపంచకప్ స్వర్ణ పతక విజేత అభిషేక్ వర్మ తెలిపాడు. వర్మ తండ్రి పంజాబ్, హరియాణా హైకోర్టులో జడ్జి. ఎప్పుడూ తన తండ్రి వెంట తుపాకులతో ఉండే బాడీగార్డులను చూసి షూటింగ్పై ఆసక్తి పెరిగిందన్నాడు. అభిషేక్ వర్మ కేవలం ఆరేళ్లలోనే అంతర్జాతీయ షూటర్గా ఎదగడం విశేషం.
బీజింగ్, రియో ప్రపంచకప్లో పతకాలు
రెండేళ్ల క్రితం ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన అభిషేక్ వర్మ.. అదే ఏడాది ప్రపంచ చాంపియన్షిప్లో టీమ్ ఈవెంట్లో రజతం గెలుపొందాడు. గతేడాది ఏప్రిల్లో బీజింగ్ (చైనా) వేదికగా జరిగిన ప్రపంచకప్లో ఒలింపిక్ చాంపియన్ పాంగ్ వీని వెనక్కి నెట్టి స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించిచాడు. ఆ ప్రదర్శనతో భారత్కు షూటింగ్లో ఐదో ఒలింపిక్ కోటాను అందించాడు. తర్వాత ఆగస్టులో రియో (బ్రెజిల్)లో జరిగిన ప్రపంచకప్లో సహచర షూటర్ సౌరభ్ వర్మను అధిగమించి వరుసగా రెండో పసిడి పతకాన్ని సాధించాడు.