IPL 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా హవా ముగిసింది. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఫీవర్ ప్రారంభమైంది. ఇదిలా ఉండగానే ఐపీఎల్ వాయిదాపై ప్రచారం జరుగుతోంది. మార్చి 28 నుంచి బెంగళూరులో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కాకపోవచ్చని తెలుస్తోంది. దానికి కారణం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు(అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం) భారత్లో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరాను తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఇప్పుడు మార్చి 28 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2026పై పడే అవకాశం కనిపిస్తోంది.

చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో హోటల్ యజమానుల సంఘాలు ఎల్పీజీ నిల్వలు కేవలం ఒకట్రెండు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు హోటళ్లు తమ మెనూను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దేశీయ అవసరాలకు, అత్యవసర విభాగాలకు మాత్రమే ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గ్యాస్ కొరతతో హోటళ్లలో ఆటగాళ్లకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. మరోవైపు యుద్ధం కారణంగా విమాన ప్రయాణ మార్గాల్లో మార్పులు జరిగాయి. దీని వల్ల ప్లేయర్ల ప్రయాణాలు, కిట్ బ్యాగుల రవాణా కష్టమవుతుంది.

మరోవైపు ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. ఈ రాష్ట్రాల్లో మ్యాచ్ల నిర్వహణ కష్టంగా మారొచ్చు. అంటే రాష్ట్రాల ఎన్ని కలతో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ అవ్వకుండా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఓవైపు ఇన్ని సవాళ్లు ఉన్నా సీఎస్కే, పంజాబ్ కింగ్స్ తమ శిక్షణా శిబిరాలను ఇప్పటికే ప్రారంభించాయి.

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఏమన్నారంటే?
ఈ క్లిష్ట పరిస్థితులపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. తాము పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. "పరిస్థితి వేగంగా మారుతోంది. ప్రస్తుతానికి ఏం చెప్పలేం. అయితే పరిస్థితుల తీవ్రతను బట్టి తగిన నిర్ణయం తీసుకుంటాం" అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఐపీఎల్ టోర్నీ మార్చి 28నే ప్రారంభం అవుతుందని భావిస్తున్నప్పటికీ.. ఇంధన కొరత తగ్గకపోతే షెడ్యూల్లో మార్పులు లేదా వాయిదా తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.