24 గోల్డ్ మెడల్స్.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతున్న అంతర్జాతీయ షూటర్!

డెహ్రడూన్: ఒకప్పుడు తన అద్భుత ప్రదర్శనతో భారత పతకాన్ని రెపరెపలాండిచిన ఓ అంతర్జాతీయ షూటర్.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేక రోడ్డు పక్కన చిప్స్ ప్యాకెట్లు అమ్ముకుంటుంది.
కెరీర్లో 24 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు సాధించిన ఆమె ప్రస్తుతం దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటుంది. చేసేదేమీలేక.. రోడ్డు పక్కన ఓ చిన్న కొట్టు నడుపుతూ వార్తల్లో నిలిచింది. ఆమె ఎవరంటే... భారత తొలి అంతర్జాతీయ పారా షూటర్ దిల్రాజ్ కౌర్. ఉత్తరాఖండ్కు చెందిన దిల్రాజ్ కౌర్ భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.
చిప్స్, బిస్కెట్స్ అమ్ముతూ..
2005లో ఈ క్రీడలోకి ప్రవేశించిన ఆమె 2015 వరకు విజయవంతంగా కొనసాగారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రెండు డజన్లకు పైగా పతకాలు గెలుచుకున్నారు. అయితే ఆ పతకాలు ఆమె కష్టాలు తీర్చలేదు. ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఆర్థిక సాయం కానీ.. ఉద్యోగం ఇవ్వడం కానీ చేయలేదు. ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన బండి పెట్టుకుని చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అమ్ముతూ.. వార్తల్లో నిలిచారు.
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం..
దిల్రాజ్ కౌర్ ఓ జాతీయ చానెల్తో మాట్లాడుతూ తనతో పాటు రాష్టంలోని చాలా మంది క్రీడాకారులు తనలా దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 'దేశానికి అవసరం ఉన్నప్పుడు నేను ముందుకు వచ్చాను.. ఎన్నో పతకాలు సాధించాను. కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం లభించలేదు. నా విజయాల ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. కానీ ప్రతిసారి తిరస్కరించారు. ప్రస్తుతం నేను మా అమ్మతో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంట్కు ఉంటున్నాను. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. అద్దె కట్టడం, మిగతా ఖర్చుల కోసం ఇలా రోడ్డు పక్కన చిప్స్, బిస్కెట్లు అమ్ముతున్నాను'' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవ్వరూ గుర్తించుకోరు..
"రాష్ట్రంలో ఉన్న చాలా మంది ప్లేయర్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఆటగాళ్ల కోసం ప్రత్యేక విధానాలు ఉన్నాయి. ఆటగాళ్ల బాగోగుల కోసం అన్ని ఏర్పాట్లు సకాలంలో జరుగుతుంటాయి. ఓ ప్లేయర్.. దేశం కోసం ఆడినప్పుడు అందరూ గర్వంగా భావిస్తారు. కానీ, కొన్ని రోజులు ముగిశాక ఓ ఆటగాడిని ఎవ్వరూ గుర్తించుకోని పరిస్థితి ఏర్పడుతోంది.'అని దిల్రాజ్ కౌర్ చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ఆటగాళ్లందరికీ సాయం చేయాలని, వారిని ఆదుకోవాలని దిల్రాజ్ కౌర్ డిమాండ్ చేశారు.

24 బంగారు పతకాలు..
దిల్రాజ్ ఇప్పటివరకు 24 బంగారు పతకాలు, 8 వెండి, 3 కాంస్య పతకాలు గెలిచారు. ఉత్తరాఖండ్ స్టేట్ షూటింగ్ పోటీల్లో నాలుగు సార్లు బంగారు పతకం గెలిచినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీల్లో ఓ వెండి పతకం సాధించారు. ఈ సమస్య ఒక్క ప్లేయర్ది మాత్రమే కాదని, రాష్ట్రంలో చాలా మంది ఆటగాళ్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి గణేష్ జోషి కుమార్తె నేహా జోషి అన్నారు. దిల్రాజ్కౌర్ ను కలిసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న స్పోర్ట్స్ పాలసీ వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమెను త్వరలోనే కలవనున్నట్లు క్రీడా శాఖ మంత్రి అర్వింద్ పాండే తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications