క్యాష్ రివార్డు ప్రకటన..
సీనియర్ రెజ్లర్ ఆచూకీ తెలిపిన వారికి రూ. లక్ష, అతడి అనుచరుడు అజయ్ కుమార్ సమాచారం చెబితే రూ. 50 వేలను బహుమతిగా ఇవ్వనున్నట్టు పోలీసులు ఇదివరకే ప్రకటించారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం సుశీల్ చేసుకొన్న దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకంతో పాటు 2012 లండన్ విశ్వక్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.
దాచిన ఫ్యాన్స్..
ఒలింపియన్ కావడంతో సుశీల్కు భారీ అభిమాన గణం ఉంది. హరియాణా, ఉత్తర్ ప్రదేశ్లోని రెజ్లర్లు అతడిని 'గురువు'గా భావిస్తారు. దీంతో కొత్త ప్రాంతాల్లో అతను దాగి ఉండేందుకు వీరు సాయం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొదట హృషికేష్లోని యోగా గురు ఆశ్రమంలో సుశీల్ ఆశ్రయం పొందినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పంజాబ్లోని బటిండాలో ఉన్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీంతో బృందాలుగా విడిపోయిన పోలీసులు హరియాణా, పంజాబ్ ప్రాంతాల్లో జల్లెడపట్టి రెజ్లర్ ఆచూకీని కనిపెట్టారు.
గ్యాంగ్స్టర్ల అండతో!
కొన్నిరోజులుగా పరారీలో ఉన్న సుశీల్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఢిల్లీ చుట్టుపక్కలున్న హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ప్రాంతాల్లో అతను సంచరిస్తున్నాడనే సమాచారం అందుకున్నామని పోలీసులు చెప్పారు. కాగా, ఒలింపిక్ రెజ్లర్ ఇలా తప్పించుకొని తిరగడంలో అతడికి ఉన్న అభిమానులతో పాటు గ్యాంగ్స్టర్లు సాయం చేసినట్టుగా అనుమానిస్తున్నారు.
టెక్నాలజీని కూడా సుశీల్ ఎంతో అప్రమత్తంగా వినియోగించేవాడని పోలీసులు వెల్లడించారు. 'అతడు సిమ్ కార్డులను తరచూ మార్చాడు. వాట్సాప్ను కూడా చాలా తక్కువ సేపు ఉపయోగించి ఫోన్ను స్విచ్చాఫ్ చేసేవాడు. తాను ఎక్కడ ఉందనే సమాచారం తెలియకుండా ఉండేందుకే అతను ఇలా తెలివిగా వ్యవహరించాడు. సుశీల్కు చాలా మంది గ్యాంగ్స్టర్లతో సన్నిహిత సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను పారిపోవడానికి వారు సాయం చేశారేమోననే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం'అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.