న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఒక రోజు చచ్చిపోతానేమో అనిపించిందని.. భయంతో తలుపులు తీసి నిద్రపోయానని భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ తెలిపింది. నేషనల్ అథ్లెటిక్స్లో 100 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్తో ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్ప్రింటర్.. కరోనా సమయంలో తాను పడిన వేదన గురించి తాజాగా మీడియాతో పంచుకుంది. 'గతేడాది నేషనల్ ట్రైనింగ్ క్యాంప్లో చేరిన తర్వాత కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మహమ్మారి ప్రభావం ఎంతగా ఉండేది అంటే ఒక్కోసారి చచ్చిపోతానమో అని భావించేదాన్ని.
కరోనా వచ్చిన నాలుగైదు రోజులకు అనుకుంటా అర్ధరాత్రి ఉన్నట్టుండి ఉలిక్కి పడుతూ మేల్కొన్నా. గాలి ఆడనట్లే అనిపించింది. వెంటనే తలుపులు, కిటికీలు తెరిచాను. ఒకవేళ నేను అపస్మారక స్థితికి వెళితే త్వరగా నా పరిస్థితి వేరే వాళ్లకు అర్థం అవుతుందని అలా చేశాను. కరోనా సమయంలో చాలా బరువు కోల్పోయాను. శరీరంలో పట్టే లేనట్లు అనిపించింది. తిరిగి సాధన ప్రారంభించిన తర్వాత మునుపటిలా పరుగెత్తలేకపోయా. శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చాయి.
కరోనాకు ముందు గాయాల కారణంగా కుంగిపోయా. వెన్ను గాయం కారణంగా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నా. చీలమండ గాయం ఉన్నా కూడా ఒలింపిక్స్ ట్రయల్స్లో పాల్గొన్నా. కానీ ఆ తప్పు వల్ల నా గాయం మరింత ఎక్కువైంది. కానీ ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. జీవితంలో ఎత్తు పల్లాలు మూమూలే. కానీ పోరాటాన్ని ఆపకూడదు' అన్న సచిన్ సార్ మాటలు స్ఫూర్తినిచ్చాయి'' అని హిమ దాస్ చెప్పుకొచ్చింది.