హైదరాబాద్: నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ టైటిల్ను లక్నోకు చెందిన దబాంగ్ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. హైదరాబాద్లోని కంట్రీ క్లబ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో దబాంగ్ డేర్ డెవిల్స్ 3-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ మైసాపై విజయం సాధించింది.
మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో గోల్ఫర్స్ గిల్డ్ 3-2 తేడాతో నానో ఫ్లిక్స్ టీమ్ను ఓడించింది.
ఈ టోర్నీ ముగింపు కార్యక్రమానికి టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, అతర్జాతీయ గోల్ఫ్ ప్లేయర్స్ టీసా మాలిక్ , ప్రితిమా దిలావరి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సీజన్ ఛాంపియన్గా నిలిచిన దబాంగ్ డేర్ డెవిల్స్ టీమ్కు రూ. 5 లక్షల ఫ్రైజ్మనీ దక్కగా.. రన్నరప్ టీమ్ మైసాకు రూ.3 లక్షలు, మూడో స్థానంలోనిలిచిన గోల్ఫర్స్ గిల్డ్ జట్టుకు రూ.2 లక్షల నగదు బహుమతి వరించింది. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ.. విజేతలతో పాటు ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తున్న టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
ఇక వచ్చే సీజన్ నుంచి మరిన్ని జట్లతో లీగ్ను నిర్వహిస్తామని డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి తెలిపారు. దేశంలో యువ గోల్ఫర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ గోల్ఫ్ ఫౌండేషన్ తరపున భవిష్యత్తులో అకాడమీని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 15న ఈ టోర్నీ ప్రారంభవ్వగా.. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న 8 జట్లు పోటీ పడ్డాయి. అరంగేట్ర సీజన్లో ఛాంపియన్గా నిలిచిన హైదరాబాద్ నగరానికి చెందిన టీమ్ మైసా ఈసారి రన్నరప్తో సరిపెట్టుకుంది.