తెరవెనుక హీరో ఒడిశా సీఎం
అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్లీ అదే ఒలింపిక్స్లో మెడల్ గెలిచే స్థాయికి భారత జట్టు చేరిందంటే కోచ్ ఆటగాళ్లు కష్టం ఎంత ఉందో.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువే ఉంది. యావత్ భారతం క్రికెట్ పిచ్చిలో మునిగి తేలుతుండటంతో ఇతర ఆటలకు ఆదరణ లేకుండా పోయింది.
దాంతో కాసులు కురిపించే క్రికెట్ను కాదని ఇతర ఆటలను ప్రమోట్ చేసేందుకు స్పాన్సర్లు ముందుకు రావడం కష్టమైంది. చాలా ఏళ్లు భారత హాకీ టీమ్కు సహారా స్పాన్సర్గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఆటకు ఆదరణ తక్కువవడంతో 2018లో సహారా తప్పుకుంది. హాకీ గేమ్కు కూడా ఇతర ఆటల్లానే స్పాన్సర్ను వెతుకునే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి సమయంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందుకొచ్చారు.
హాకీ ప్లేయర్ కావడంతో...
హాకీ ఆటపై ఉన్న మక్కువతో పాటు జాతీయ క్రీడను బతికించాలనే ఆలోచనతో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందని చెప్పాడు. ఐదేళ్లకుగాను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రూ.100 కోట్లకు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందమే భారత హాకీ టీమ్ రాతను మార్చింది. నవీన్ పట్నాయక్ గతంలో హాకీ ప్లేయరే. ఆయన స్కూల్లో చదువుతున్న సమయంలో హాకీ గోల్కీపర్గా తన టీమ్ తరఫున బరిలోకి దిగేవాడు.
ఆ ఇష్టంతోనే టీమ్కు స్పాన్సర్గా వ్యవహరించడానికి ఆయన ముందుకు వచ్చారు. పురుషుల జట్టుతోపాటు మహిళలూ జట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్సర్గా ఉండటానికి ఒడిశా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అయిన మూడేళ్ల తర్వాత హాకీ టీమ్ ఒలింపిక్స్లో మెడల్ గెలిచింది. మహిళల టీమ్ కూడా మెడల్కు అడుగు దూరంలో ఉంది.
భారత హాకీ ప్రతీ అడుగులో..
2014లో ఒడిశా ప్రభుత్వం చాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్సర్షిప్కు బీజం పడింది. ఆ టోర్నీపై నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ తర్వాత 2017లో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్గా ఉన్న కలింగ లాన్సర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్ను గెలిచింది. ఇక 2018లో హాకీ వరల్డ్ లీగ్ను కూడా ఒడిశా నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్స్, ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జరిగాయి. ఇలా ఇండియన్ హాకీ వేసే ప్రతి అడుగులోనూ నవీన్ పట్నాయక్ తెర వెనుక హీరోగా ఉంటూ వస్తున్నారు.
స్పోర్ట్స్ హబ్గా ఒడిశా
ఇక, మన హాకీ ప్లేయర్లు ఒడిశాని తమ రెండో ఇల్లుగా భావిస్తారు. ఒడిశాను మన దేశంలోనే స్పోర్ట్స్ హబ్గా హాకీ ప్లేయర్లు పేర్కొంటారు. హాకీకి కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా.. మౌలిక సదుపాయాలు కూడా అందించింది నవీన్ పట్నాయక్ సర్కార్. ఈ ఒలింపిక్స్లో ఇండియన్ టీమ్ ఆడిన పలు మ్యాచ్లను నవీన్ పట్నాయక్ చూశారు. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ గెలిచిన తర్వాత కూడా టోక్యోలో ఉన్న టీమ్తో వీడియో కాల్లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి భారతీయుడికీ ఇది గర్వకారణమని నవీన్ పట్నాయక్ అన్నారు. ఒడిశా నుంచి పురుషుల, మహిళల జట్లులో ప్లేయర్లున్నారు.
మరోవైపు టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత క్రీడాకారులు హాకీలో కాంస్య పతకం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఈ విజయంతో భారతదేశపు ప్రముఖ క్రీడ హాకీ విశ్వ వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ను, జట్టు క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రశంసించారు.