న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు మరో 11 రోజుల్లో తెరలేవనుంది. ఓ వైపు కరోనా భయపెడుతున్నా.. కట్టుదిట్టమైన భద్రత చర్యల మధ్య సమ్మర్ గేమ్స్ నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే టోక్యోలో కరోనా ఎమెర్జెన్సీ విధించారు. అయితే సెమీఫైనల్లో ఓడినా.. స్వర్ణం కోసం పోరాడే అవకాశం రావొచ్చు. కానీ అలా జరగాలంటే ఆ జట్టుకు అదృష్టం తలుపు తట్టాలి. ఫైనల్ చేరిన రెండు జట్లలో ఏదైనా కరోనా కారణంగా తప్పుకుంటే ఆ జట్టు చేతిలో సెమీఫైనల్లో ఓడిన బృందానికి ఫైనల్ ఆడే అవకాశం రాబోతోంది. హాకీ, రెజ్లింగ్, టెన్నిస్, అథ్లెటిక్స్తో పాటు ఇతర క్రీడల్లో ఈ నిబంధన అమల్లోకి రానుంది.
టోక్యో ఒలింపిక్స్ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, అంతర్జాతీయ సమాఖ్యలు సంయుక్తంగా ఆదివారం ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశాయి. హాకీని తీసుకుంటే ఫైనల్ చేరిన ఏదైనా జట్టు కరోనా కారణంగా తప్పుకుంటే ఆ జట్టు చేతిలో సెమీస్లో ఓడిన టీమ్ నేరుగా ఫైనల్ ఆడుతుంది. అలాంటి పరిస్థితి వస్తే కాంస్య పతక పోరు నిర్వహించరు. సాధారణంగా ఓడిన సెమీఫైనలిస్టుల మధ్య కాంస్యం కోసం పోటీ జరుగుతుంది. రెజ్లింగ్, టెన్నిస్, అథ్లెట్లిక్స్కూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఎవరైనా క్రీడాకారులు కోవిడ్తో తప్పుకుంటే వారి తర్వాత ఉత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లకు పోటీపడే అవకాశాన్ని ఇవ్వనున్నారు. ఇక భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించాయి.
26 మంది సభ్యులతో కూడిన భారత అథ్లెటిక్స్ టీమ్ జూలై 23 నుంచి ఆగస్టు 8వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగనుంది. అథ్లెటిక్స్ పోటీలు జూలై 30న జరగనున్నాయి. అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభమైన రోజే భారత్ నుంచి అవినాష్ సబ్లే(పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ రౌండ్1), ద్యుతీ చంద్(మహిళల 100 మీటర్ల రౌండ్1) పోటీ పడనున్నారు.