ఒక్కో ప్లేయర్కు రూ. 10 లక్షలు..
ఒక్కో ప్లేయర్కు రూ. 10 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 5 లక్షలు చొప్పున ప్రోత్సాహక బహుమతిగా అందజేసిన ఒడిషా ప్రభుత్వం హాకీ ఇండియాకు కూడా రూ. 50 లక్షల సాయం అందించింది. ఒడిశా ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. భారత క్రీడాభిమానులు నవీన్ పట్నాయక్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 2018 నుంచి భారత హాకీ జట్లకు 'టీమ్ స్పాన్సర్'గా ఒడిశా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇటీవల ముగిసిన ఒలింపిక్స్లో పురుషుల జట్టు 41 ఏళ్ల పతక నిరీక్షిణకు కాంస్యంతో తెరదించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. హోరాహోరీగా సాగిన కాంస్య పోరులో మన్ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు 5-4తో జర్మనీని చిత్తు చేసి 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణం తర్వాత మళ్లీ విశ్వక్రీడల్లో పతకాన్ని అందుకుంది.
తెరవెనుక హీరో నవీన్ పట్నాయక్..
భారత హాకీ విజయంలో ఆటగాళ్ల ప్రదర్శన ఎంత ఉందో.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువే ఉంది. యావత్ భారతం క్రికెట్ పిచ్చిలో మునిగి తేలుతుండటంతో ఇతర ఆటలకు ఆదరణ లేకుండా పోయింది. దాంతో కాసులు కురిపించే క్రికెట్ను కాదని ఇతర ఆటలను ప్రమోట్ చేసేందుకు స్పాన్సర్లు ముందుకు రావడం కష్టమైంది. చాలా ఏళ్లు భారత హాకీ టీమ్కు సహారా స్పాన్సర్గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఆటకు ఆదరణ తక్కువవడంతో 2018లో సహారా తప్పుకుంది. హాకీ గేమ్కు కూడా ఇతర ఆటల్లానే స్పాన్సర్ను వెతుకునే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి సమయంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందుకొచ్చారు.
హాకీ ప్లేయర్ కావడంతో...
హాకీ ఆటపై ఉన్న మక్కువతో పాటు జాతీయ క్రీడను బతికించాలనే ఆలోచనతో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుందని నవీన్ పట్నాయక్ అప్పట్లో చెప్పాడు. ఐదేళ్లకుగాను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రూ.100 కోట్లకు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందమే భారత హాకీ టీమ్ రాతను మార్చింది. నవీన్ పట్నాయక్ గతంలో హాకీ ప్లేయరే. ఆయన స్కూల్లో చదువుతున్న సమయంలో హాకీ గోల్కీపర్గా తన టీమ్ తరఫున బరిలోకి దిగేవాడు. ఆ ఇష్టంతోనే టీమ్కు స్పాన్సర్గా వ్యవహరించడానికి ఆయన ముందుకు వచ్చారు. పురుషుల జట్టుతోపాటు మహిళలూ జట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్సర్గా ఉండటానికి ఒడిశా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అయిన మూడేళ్ల తర్వాత హాకీ టీమ్ ఒలింపిక్స్లో మెడల్ గెలిచింది. మహిళల టీమ్ కూడా అత్యుత్తమ ప్రదర్శనతో తృటిలో మెడల్ కోల్పోయింది.
భారత హాకీ ప్రతీ అడుగులో..
2014లో ఒడిశా ప్రభుత్వం చాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్సర్షిప్కు బీజం పడింది. ఆ టోర్నీపై నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ తర్వాత 2017లో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్గా ఉన్న కలింగ లాన్సర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్ను గెలిచింది. ఇక 2018లో హాకీ వరల్డ్ లీగ్ను కూడా ఒడిశా నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్స్, ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జరిగాయి. ఇలా ఇండియన్ హాకీ వేసే ప్రతి అడుగులోనూ నవీన్ పట్నాయక్ తెర వెనుక హీరోగా ఉంటూ వస్తున్నారు.