టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన పోరు తాము ఆడిన గొప్ప క్రికెట్ మ్యాచ్ అని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని గుర్తు చేసుకున్నాడు. ఇది చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ అని చెప్పుకొచ్చాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ.. ఆదివారం వెస్టిండీస్పై టీమిండియా విజయం సాధించి సెమీఫైనల్ చేరిన నేపథ్యంలో ఐసీసీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా తాము ఆడిన రోజుల్లోనే ఐకానిక్ మ్యాచ్ గురించి చెప్పమని అడగ్గా.. మెల్బోర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్ను గుర్తు చేసుకున్నాడు.
'2022 టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ మేం ఆడిన గొప్ప క్రికెట్ మ్యాచ్ల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అది వరల్డ్ కప్ మ్యాచ్ కావడం.. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండటం.. ఓటమి అంచు నుంచి పుంజుకుని గెలవడం ఆ మ్యాచ్ను మరింత స్పెషల్గా మార్చింది.
ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఆట చూడటం నిజంగా చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే మేం మ్యాచ్ ప్రారంభించిన విధానం చూస్తే.. అస్సలు గెలిచే స్థితిలోనే లేము. కానీ ముగించిన తీరు మాత్రం అమోఘం. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సందర్భంగా నేను డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాను.

బయటకు వచ్చాను కానీ ఒత్తిడి వల్ల మళ్లీ లోపలికి వెళ్ళిపోయాను. మ్యాచ్లు ఇంత ఉత్కంఠభరితంగా ఉన్నప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. నేను కూడా చాలా ఆందోళన చెందాను. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అప్పుడు విరాట్ కోహ్లీ ఒక సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అసలు గెలుస్తామన్న ఆశ లేని స్థితి నుంచి జట్టును గెలిపించాడు.
ఆ మ్యాచ్ ముగించిన విధానం అద్భుతం. ఇది ఖచ్చితంగా మేం ఆడిన అత్యంత గొప్ప క్రికెట్ మ్యాచ్ల్లో ఒకటి.'అని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ ఎత్తుకున్నాడు. విరాట్ కోహ్లీ కెరీర్లోనే ఇది బెస్ట్ ఇన్నింగ్స్. హ్యారీస్ రౌఫ్ బౌలింగ్లో కోహ్లీ కొట్టిన సిక్స్లు ఇప్పటికి అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ల్లో తన ఫేవరెట్ మాత్రం ఖచ్చితంగా 2007 టీ20 ప్రపంచకప్ ఫైనలేనని రోహిత్ శర్మ తెలిపాడు. ఆ మ్యాచ్ను ఏదీ అధిగమించలేదని, ఆ మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ అందుకున్నామని రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన మ్యాచ్లోనూ సంజూ శాంసన్ ఇదే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. అసాధారణ బ్యాటింగ్తో టీమిండియాను సెమీస్కు చేర్చాడు.