హైదరాబాద్: భారత ఫుట్బాల్ అభిమానులకు ఫుట్బాల్ అసోసియేషన్( ఫిఫా) షాకిచ్చింది. ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను సస్పెండ్ చేస్తూ సంచలన ప్రకటన చేసింది. పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో పాటు ఫెడరేషన్కు సంబంధం లేని వ్యక్తల జోక్యం అతిగా ఉందని ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) తన రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను తిరిగి పొందే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ వార్తతో భారత్ ఫుట్బాల్ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 11-30 తేదీల్లో భారత్లో జరగాల్సిన ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది. అయితే ఫిఫా.. భారత ఫుట్బాల్ అసోసియేషన్పై ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను, దారి తీసిన పరిస్థితులపై ఓ లుక్కెద్దాం.
ఏ రోజు ఏం జరిగిందంటే..?
మే 18: ఫుట్బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) చీఫ్ ప్రఫుల్ పటేల్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం తీర్పు నిచ్చింది. అప్పటికే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఏఆర్ దవే, మాజీ సీఈసీ ఎస్వై ఖురేషి, భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ భాస్కర్ గంగూలీలతో కూడిన పాలకమండలిని నియమించింది.
#మే 23: ఏఐఎఫ్ఎఫ్ సుప్రీం నియమిత పాలకమండలి కిందకి వెళ్లడంతో భారత ఫుట్బాల్ జట్టుపై నిషేధం విధించవద్దని ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినోను ప్రఫుల్ పటేల్ కోరాడు.
మే29: సీఓఏ సభ్యుడు ఖురేషి సెప్టెంబర్ చివరి నాటికి ఏఐఎఫ్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని, సవరించిన రాజ్యాంగాన్ని జూలై 15 నాటికి సుప్రీం కోర్టుకు సమర్పించాలని చెప్పారు.
#జూన్ 11: జాతీయ క్రీడా కోడ్, ఫిపా, ఏషియన్ ఫుట్బాల్ కాన్వడరేషన్(ఏఎఫ్సీ) చట్టాలకు కట్టుబడి కొత్త రాజ్యాంగం ప్రకారం ఎఐఎఫ్ఎఫ్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు సీఓఏ సభ్యులు కొన్ని అనుబంధ యూనిట్లతో సమావేశమయ్యారు.
#జూన్ 21: భారత ఫుట్బాల్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఫిఫా,ఎఫ్సీ బృంధాలతో, సీఓఏ మధ్య మొదటి రౌండ్ చర్చలు సజావుగా సాగాయి.
జూన్ 22: ఏఐఎఫ్ఎఫ్ వ్యవహార తీరును తెలుసుకున్న ఫిఫా-ఎఫ్సీ బృందం జాతీయ క్రీడా అసోసియేషన్లో సుప్రీం జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పాయి.
జూన్ 23: భారత ఫుట్బాల్ సమాఖ్య గురించి తెలుసుకున్న ఫిఫా, ఎఫ్సీ బృందం నిర్ణీత గడువు విధించింది. జూలై 31లోపు కొత్త రాజ్యంగాన్ని ఆమోదింప చేసుకోవాలని, సెప్టెంబర్ 15 వరకు ఎన్నికలు నిర్వహించుకోవాలని పేర్కొంది.
జూలై 13: ఏఐఎఫ్ఎఫ్ తుది ముసాయిదా రాజ్యాంగాన్ని సీఓఏ ఫిఫాకు పంపింది.
జూలై 16: ఏఐఎఫ్ఎఫ్ సవరించిన రాజ్యాంగాన్ని ఆమోదం కోసం సుప్రీం కోర్టుకు సీఓఏ సమర్పించింది.
జూలై 18: సవరించిన రాజ్యాంగంలో ఉన్న అనేక నిబంధనలపై ఏఐఎఫ్ఎఫ్ అనుబంధ రాష్ట్రాల ఫెడరేషన్స్ అభ్యంతరం వ్యక్తం చేశాయి.
జూలై 21: ఎఐఎఫ్ఎఫ్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సుప్రీం గుర్తించింది.
జూలై 26: సీఓఏ ద్వారా సవరించిన రాజ్యాంగంలో కోఆప్టెడ్ సభ్యుల సంఖ్య 50 శాతానికి మించకూడదని పేర్కొనగా.. అందులో 25 శాతం ప్రముఖ ఆటగాళ్లకు ప్రాతినిథ్యం ఇవ్వాలని ఫిఫా, ఏఐఎఫ్ఎఫ్ సూచించింది.
జూలై 28: ఆగస్టు 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను విచారిస్తామని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్లతో కూడా సుప్రీం బెంచ్ తెలిపింది.
ఆగస్టు 3: సీఓఏ ప్రతిపాధించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను త్వరగా నిర్వహించాలని ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీనీ సుప్రీం ఆదేశించింది.
ఆగస్టు 5: ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికలకు సీఓఏ సూచించిన కాలపరిమితిని సుప్రీం ఆమోదించింది. ఆగస్టు 28న ఎన్నికలు జరుగుతాయని, ఎన్నికల ప్రక్రియ ఆగస్టు 13న మొదలవుతుందని పేర్కొంది.
ఆగస్టు 6: భారత ఫుట్బాల్ సమాఖ్యలో ఇతరు అతి జోక్యం కారణంగా అక్టోబర్లో భారత్ వేదికగా జరగనున్న అండర్ 17 ప్రపంచకప్ పోటీలను తరలిస్తామని, నిర్వహించే హక్కును నిలిపేస్తామని ఫిఫా బెదిరించింది.
ఆగస్టు 7: ఏఐఎఫ్ఎఫ్ని సెట్ అవ్వడానికి సిద్దంగా ఉందని సీఓఏ ఫిఫా హామీ ఇచ్చింది.
ఆగస్టు 10: సుప్రీం విచారణలో జోక్యం చేసుకున్నందుకు ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పదవి కోల్పోయిన ప్రఫుల్ పటేల్పై సీఓఏ ధిక్కార పిటీషన్ ధాఖలు చేసింది.
ఆగస్టు 11: ప్రఫుల్ పటేల్ ఏఐఎఫ్ఎఫ్ మీటింగ్లో పాల్గొంటే రాష్ట్రాల ఫెడరేషన్స్లో జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది.
ఆగస్టు 13: ఆగస్టు 28న జరగనున్న జనరల్ బాడీ ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీతో కూడిన ఓటర్ల జాబితాలో భైచుంగ్ భూటియా మరియు IM విజయన్తో సహా 36 మంది ప్రముఖ ఆటగాళ్లను AIFF కలిగి ఉంది.
ఆగస్టు 15: థర్డ్ పార్టీల అతి జోక్యం కారణంగా ఫిఫా ఎఐఎఫ్ఎఫ్ను సస్పెండ్ చేసింది.
నిషేధం అమల్లో ఉన్నంత వరకు మహిళల అండర్ 17 ప్రపంచకప్ భారత్లో నిర్వహించలేరు. అంతర్జాతీ పోటీల్లో, ధ్వైపాక్షిక సిరీస్ల్లో భారత జట్టు పాల్గొనలేదు.