దోహా: ఫిఫా ప్రపంచకప్ 2022లో ఇరాన్ బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తమ రెండో మ్యాచ్లో ఇరాన్ 2-0తో వేల్స్పై గెలుపొందింది. ఇంజ్యూరీ టైమ్లో గోల్స్ చేసిన రూజ్బే చేష్మీ (90+8 నిమిషం), రామిన్ రిజయాన్(90+11 నిమిషం) ఇరాన్కు అద్భుత విజయాన్నందించారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. వేల్స్ గోల్ పోస్ట్లోకి ఇరాన్ ఆటగాళ్లు పదే పదే దాడిచేసినా ఫలితం లేకపోయింది. వేల్స్ డిఫెన్స్ విభాగం పాదరసంలా కదలడంతో ఇరాన్ ఆటగాళ్లు తీవ్ర శ్రమించాల్సి వచ్చింది. దాంతో ఇరు జట్లు ఫస్టాఫ్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి.
సెకండాఫ్లోనూ హోరీ హోరీగా తలపడ్డాయి. అయితే వేల్స్ గోల్ కీపర్ వేన్ హెన్నెస్సీ అత్యుత్సాహం ఆ జట్టు కొంపముంచింది. ఇరాన్ ప్లేయర్ను ట్యాకిల్ చేసే విషయంలో హద్దులు ధాటిన హెన్నెసీ ప్రత్యర్థి ఆటగాడు గాయపడేలా దురుసుగా ప్రవర్తించాడు. ఆట 86వ నిమిషయంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నాడు. దాంతో ఈ ఫిఫా ప్రపంచకప్లో రెడ్ కార్డ్ అందుకున్న తొలి ఆటగాడిగా వేల్స్ గోల్ కీపర్ రికార్డుకెక్కాడు. ఈ ఊహించని ఘటనతో వేల్స్ తీవ్రంగా నష్టపోయింది. 10 మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ కొనసాగించాల్సి వచ్చింది.
ఇదే అదునుగా భావించిన ఇరాన్ ఆటగాళ్లు వేల్స్ గోల్ పోస్ట్పై దాడికి దిగారు. మ్యాచ్ నిర్ణీత సమయం వరకు పోరాడిన వేల్స్ డిఫెన్స్ విభాగం.. ఇంజ్యూరీ టైమ్లో చేతులెత్తేసింది. ఒక ఆటగాడు తక్కువగా ఉండటంతో గోల్స్ను అడ్డుకోవడం విఫలమైంది. ఇక 90+8 నిమిషంలో ఇరాన్ ప్లేయర్ రూజ్బే చేష్మీ బంతి అద్భుతంగా గోల్ పోస్ట్లోకి పంపించి ఖాతా తెరిచాడు. మరో మూడు నిమిషా వ్యవధిలోనే ఆ ఆనందాన్ని డబుల్ చేస్తూ మరో ఇరాన్ ప్లేయర్ రామిన్ రిజయాన్ గోల్ కొట్టాడు. దాంతో ఇరాన్ 2-0తో ఆధిక్యం సాధించింది. అదే జోరులో మ్యాచ్ను ముగించి అద్భుత విజయాన్నందుకుంది.
టోర్నీలో ముందడుగు వేయాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఇరాన్కు తప్పనిసరి. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఇరాన్ 6-2 తేడాతో చిత్తుగా ఓడింది. తాజా విజయంతో పాయింట్స్ టేబుల్లో ఖాతా తెరిచిన ఇరాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాతో బుధవారం(నవంబర్30) ఇరాన్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.