హైదరాబాద్: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ హుందాగా వ్యవహిరిచాలని సూచించాడు. అయితే ఇదేదో అతను సిరీయస్గా చెప్పాడనుకుంటే మీరంతా పప్పులో కాలేసినట్లే. ఇన్స్టాగ్రామ్ వేదికగా దాదా పెట్టిన పోస్ట్కు యువీ సరదాగా పెట్టిన కామెంట్ ఇది.
అవును ఆటపట్టించేలా ఉన్న ఈ కామెంట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
గంగూలీ లార్డ్స్ మైదానం వేదికగా తన అరంగేట్ర టెస్ట్ క్షణాలను, తొలి సెంచరీ సాధించిన మధురానుభూతిని నెమరవేసుకుంటూ దానికి సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ ఫొటోలో గంగూలీ సెంచరీ అభివాదం చేస్తుండగా.. వెనుకాల ద్రవిడ్ అభినందిస్తున్నాడు.
గూగుల్లో సెర్చ్ చేసి మరీ గంగూలీ ఆనాటి ఫొటోను షేర్ చేశాడు. అయితే ఆ ఫొటోకు వాటర్ మార్క్ ఉందన్న విషయం దాదా గుర్తించలేకపోయాడు. పైగా ఈ ఫొటోకు ఇదొక చిరస్మరణీయమైన క్షణం అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వాటర్ మార్క్ వ్యవహారాన్నే ప్రస్తావిస్తూ వరల్డ్కప్ విన్నింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ఓ ఏజెన్సీకి సంబంధించిన ఫొటోననే విషయాన్ని ప్రస్తావిస్తూ దాదాను ఆట పట్టించాడు. 'దాదా లోగో తీసేయ్.. ఇప్పుడు నువ్వు.. బీసీసీఐ ప్రెసిడెంట్. కొంచెం హుందాగా ఉండు'అని సరదాగా కామెంట్ చేశాడు.
ప్రతీ సిరీస్లో బుమ్రా రాణించాలంటే ఎలా? : మాజీ పేసర్
ఇక గంగూలీ 1996లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో టెస్ట్క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ అరంగేట్ర మ్యాచ్లోనే (131) దాదా సెంచరీతో చెలరేగాడు. ఇక గంగూలీ కూడా ఇలా సోషల్ మీడియా వేదికగా ఆటపట్టించడంలో ముందుంటాడు. ఫన్నీ కామెంట్స్తో అలరిస్తుంటాడు. బుష్ఫైర్ చారిటీ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సచిన్ ఉద్దేశించి సరదాగా కామెంట్ చేశాడు. సచిన్ అక్కడి ఫొటోలను ఇన్స్టాలో అప్లోడ్ చేయగా.. వాటిపై దాదా 'కొంత మంది నిజంగా అదృష్టవంతులు.. హాలీడేస్ను హాయిగా గడుపుతారు'అని తన బీసీసీఐ బాధ్యతలను ఉద్దేశించి ఫన్నీగా కామెంట్ చేశాడు.