రాజస్థాన్ రాయల్స్ జట్టులో తన సమయం ముగియడంతోనే బయటకు వచ్చానని ఆ జట్టు మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్కు ప్రత్యర్థిగా ఆడటం ఇదే తొలిసారని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు సంజూ శాంసన్ను రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్కు సంజూ ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు.
తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడటానికి గల కారణాన్ని సంజూ శాంసన్ వెల్లడించాడు. 'నేను ఆ జట్టులో నా సమయం ముగిసిందని భావించా. అందుకే రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్ రాయల్స్కు ప్రత్యర్థిగా ఆడటం ఇదే తొలిసారి. ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు రాలేదు. అయితే నేను ఒక్కసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించి తప్ప ఇంకేమి ఆలోచించను.
రాజస్థాన్ టీమ్లో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా నాకు తెలుసు. వారు నా పట్ల చాలా ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్తో నా సమయం ముగిసింది. నేను ముందుకుసాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్ రాయల్స్పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.

సీఎస్కేకు ట్రేడ్ అయిన విషయం తెలియగానే మహీ భాయ్తో ఫోన్లో మాట్లాడా. అతనితో కలిసి ఒకే జట్టులో ఆడబోతుండడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ధోనీ నుంచి నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం. సీఎస్కే తరఫున ఆడేందుకు ఆసక్తి ఎదురు చూస్తున్నా. నాకు ఎంతో మద్దతుగా నిలిచిన చెన్నై అభిమానులకు ధన్యవాదాలు.
వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు విజయమే ముఖ్యం. ఈ విషయం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో పదే పదే చెబుతారు. టీమ్లో ప్రతి ఒక్కరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తారు. నేను కూడా మొదటి నుంచి ఇదే నమ్ముతాను. జట్టు విజయం కోసమే కృషి చేయడం ముఖ్యం. కేరళలో వయసు విభాగాల టోర్నీలు ఆడుతున్నప్పటి నుంచి ఇదే ఆలోచనతో నేను బరిలో దిగేవాడిని. జట్టు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాను.'అని సంజూ తెలిపాడు.