ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన భారత జట్టుపై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైట్బాల్ క్రికెట్ టీమ్ భారత్ అని కొనియాడాడు. ఐపీఎల్ వల్లే వైట్బాల్ క్రికెట్లో టీమిండియా తిరుగులేని శక్తిగా ఎదిగిందని అభిప్రాయపడ్డాడు.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో అహ్మాదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం విదితమే. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ గెలిచిన తొలి జట్టుగా.. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ సాధించిన టీమ్గా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 3 టీ20 ప్రపంచకప్లు గెలిచిన ఏకైక జట్టుగా కూడా రికార్డు సాధించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 నుంచి తాజా విజయం వరకు ఒక్క ద్వైపాక్షిక సిరీస్లోనూ భారత్ ఓడిపోలేదు. మెగా టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 పోరులో ఓటమిపాలైనా.. నేలకు కొట్టిన బంతిలా పుంజుకొని టైటిల్ ఎగరేసుకుపోయింది.
భారత ప్రదర్శనను కొనియాడిన రికీ పాంటింగ్.. గత 5-6 ఏళ్లుగా వైట్బాల్ క్రికెట్ను శాసిస్తున్నారని అభిప్రాయపడ్డాడు. 'ప్రస్తుత భారత టీ20 జట్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ జట్టు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ జట్టులో ప్రపంచ స్థాయి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. గత 5-6 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది.

భారత్ ఆధిపత్యానికి ఐపీఎల్ కీలక కారణం. అంతర్జాతీయ క్రికెట్ స్థాయిలో జరిగే ఐపీఎల్ను నిరంతరం ఆడటం ద్వారా ఆటగాళ్లకు అపారమైన అనుభవం పొందారు. ప్రతి ఐపీఎల్ మ్యాచ్ అంతర్జాతీయ స్థాయి తరహా ఒత్తిడిని కలిగిస్తుంది. అలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవంతో భారత్ ఒక అత్యుత్తమ జట్టుగా బరిలోకి దిగి నిరంతరం విజయాలు సాధిస్తోంది.’అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
2000 నుంచి 2010 వరకు ప్రపంచంలోనే తిరుగులేని వన్డే, టెస్ట్ టీమ్ ఆస్ట్రేలియా కొనసాగింది. ఆ సమయంలో రికీ పాంటింగ్ ఆసీస్కు కెప్టెన్గా వ్యవహరించాడు ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పాంటింగ్ గుర్తింపు పొందాడు. అలాంటి పాంటింగ్ భారత టీ20 జట్టును ప్రపంచంలోనే బలమైన జట్టుగా అభివర్ణించడంపై భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్లో పాంటింగ్ పంజాబ్ కింగ్స్కు కోచ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.