టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ప్లేస్లోకి రావాలనుకుంటున్నానని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. ధోనీ హెడ్ కోచ్ అయితే తాను కూడా 'నవ్వవయ్యా బాబు'అని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతానని చెబుతూ నవ్వులు పూయించాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం టీమిండియాను కొనియాడుతూ మహేంద్ర సింగ్ ధోనీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో గంభీర్ ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలని, ఆ నవ్వు చాలా బాగుందని పేర్కొన్నాడు.
'అహ్మదాబాద్లో సరికొత్త చరిత్ర సృష్టించిన టీమిండియాకు, సపోర్ట్ స్టాఫ్కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఆడుతుంటే చూడటం చాలా ఆనందంగా ఉంది. కోచ్ సాబ్.. మీ ముఖంలోని ఆ చిరునవ్వు చాలా బాగుంది. విజయం సాధించాలనే నీ పట్టుదల, ఆ చిరునవ్వు కిల్లర్ కాంబినేషన్. వెల్ డన్! అబ్బాయిలూ.. ఈ విజయాన్ని ఆస్వాదించండి. బుమ్రా గురించి నేను ఏమీ రాయకపోవడమే మంచిది. అతను ఒక ఛాంపియన్ బౌలర్.'అని ట్రోఫీతో ఉన్న భారత జట్టు ఫొటోను ధోనీ షేర్ చేశాడు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోనీ.. భారత విజయాన్ని కొనియాడుతూ పోస్ట్ పెట్టడం.. గంభీర్ నవ్వు బాగుందని చెప్పడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. అదే రోజు ధోనీ చమత్కారానికి గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. 'ధోనీ.. నిన్ను మైదానంలో చూసిన సంతోషంలో వచ్చిన చిరునవ్వు అది'అని గంభీర్ బదులిచ్చాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ పోస్ట్లపై స్పందించిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ప్రత్యక్షంగా ఫైనల్కు వచ్చి మ్యాచ్లను వీక్షించడం బాగుందని, తనను నవ్వుతూ ఉండాలని చెప్పడం ఇంకా నచ్చిందని గంభీర్ తెలిపాడు. 'ధోనీని ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్లో చూడటం బాగుంది. ప్రపంచకప్ను ప్రత్యక్షంగా వీక్షించడం నచ్చింది. నన్ను నవ్వమన్నందుకు అభినందించాలి.
ఏదొక రోజు అతను కూడా నేనుండే స్థానానికి రావాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను కూడా నవ్వవయ్యా బాబు అని పోస్ట్లు పెడుతా. అయితే డగౌట్ నుంచి అతను తప్పకుండా నవ్వుతాడని భావిస్తున్నా.'అని గంభీర్ వెల్లడించాడు.