టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మద్దతుతోనే విరాట్ కోహ్లీ స్టార్ క్రికెటర్గా ఎదిగాడని మాజీ చీఫ్ సెలెక్టర్, తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. కెరీర్ ప్రారంభంలో పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీని జట్టు నుంచి తొలగించాలని అందరూ ఒత్తిడి చేసినా.. ధోనీ వినలేదని ఎమ్మెస్కే వెల్లడించాడు.
అండర్ 19 ప్రపంచకప్ 2008 విజయంతో తారా జువ్వలా భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన కోహ్లీ.. ఆరంభంలో కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. కొన్ని మెరుగైన ప్రదర్శనలు చేసినా నిలకడగా రాణించలేకపోయాడు. ముఖ్యంగా 2011-12 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు.
ఈ పర్యటనలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ కోసం కోహ్లీని పక్కన పెట్టి రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావించారు. కానీ ధోనీ వ్యతిరేకించాడు. కోహ్లీపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇవ్వాలని పట్టుబట్టాడు. ఆ నమ్మకాన్నికోహ్లీ నిలబెట్టుకున్నాడు. పెర్త్ టెస్టులో 44, 75 పరుగులు చేయడంతో పాటు అడిలైడ్ టెస్టులో తన తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.

ఈ పర్యటనకు ముందు పార్టీలు, పబ్లు అంటూ లైఫ్ను ఎంజాయ్ చేసినా కోహ్లీ.. ఆ తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల తరహాలో ఫిట్నెస్ సాధిస్తేనే విజయాలు దక్కుతాయని గ్రహించాడు. సీరియస్గా ఫిట్నెస్పై ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత వరల్డ్ క్లాస్ క్రికెటర్గా ఎదిగాడు. 2014 ఇంగ్లండ్ పర్యటన పీడ కలగా మిగిలినా.. తన ఆటను అప్డేట్ చేసుకొని పరుగుల వరద పారించాడు.

తాజాగా ఇదే విషయాన్ని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహాలో వచ్చే సర్కార్ ప్రోగ్రామ్ 6వ ఎపిసోడ్కు ఎమ్మెస్కే ప్రసాద్ తన సహచర తెలుగు కామెంటేటర్లు కౌశిక్, కళ్యాణ్, వింధ్య విశాఖతో కలిసి హాజరయ్యాడు. ఈ షోకు సుడిగాలి సుధీర్ హోస్ట్గా వ్యహరిస్తున్నాడు.
ఈ 6వ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో విరాట్ కోహ్లీకి ధోనీ అండగా నిలిచిన విషయాన్ని ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తు చేశాడు. 'ఒకానొక సమయంలో కోహ్లీ ఫామ్ కోల్పోయి, ఫిట్నెస్ విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టాలనుకున్నారు. కానీ ధోనీ ఒక్కడే కోహ్లీకి అండగా నిలబడి, విరాటే భారత క్రికెట్ భవిష్యత్తు అని నమ్మి అవకాశాలు ఇచ్చారు'అని పేర్కొన్నాడు.
ఒకవేళ ఆరోజు ధోనీ పట్టుబట్టి కోహ్లీకి మద్దతు ఇవ్వకపోయి ఉంటే, ఈరోజు మనం చూస్తున్న 'రన్ మెషీన్' విరాట్ కోహ్లీని చూసేవాళ్లం కాదేమో అని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్గా మారింది. 2019 వరల్డ్ కప్ సమయంలో అంబటి రాయుడు ఎంపికపై జరిగిన వివాదం గురించి కూడా ఈ షోలో ఎమ్మెస్కే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ మార్చి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విరాట్ కోహ్లీ సైతం ఎన్నో ఇంటర్వ్యూల్లో ధోనీ భాయ్ తనకు అండగా నిలిచాడని చెప్పాడు. 'నా కెరీర్ ఆరంభంలో ధోనీ భాయ్ నాకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే, నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. సెలెక్టర్లు నన్ను జట్టు నుంచి తీసేయాలని చూసినప్పుడు ధోనీనే నన్ను కాపాడారు.'అని కోహ్లీ పేర్కొన్నాడు.