టీ20 క్రికెట్ చరిత్రలో ఆల్టైమ్ అత్యుత్తమ ఆటగాడు ఎవరనే చర్చకు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆల్టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ అని తెలిపాడు. కొత్త బంతి అయినా.. పాత బంతి అయినా చివరకు సూపర్ ఓవర్ అయినా.. బుమ్రా చేతికి బంతి ఇస్తే మ్యాచ్ను గెలిపిస్తాడని వివరణ ఇచ్చాడు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు. అయితే తనకు బౌలింగ్ చేయనంత వరకే బుమ్రా గ్రేటెస్ట్ బౌలర్ అని చమత్కరించాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజ బ్యాటర్ల పేర్లు చెప్పకుండా.. డివిలియర్స్ ఒక బౌలర్ను ఎంచుకోవడం విశేషం.

2013 మార్చిలో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. 270 మ్యాచ్లు ఆడి 345 వికెట్లు తీసాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున 95 మ్యాచ్ల్లో 121 తీసాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 145 మ్యాచ్ల్లో 183 వికెట్లు తీసాడు. ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు.
మరోవైపు పాకిస్థాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్..జస్ప్రీత్ బుమ్రాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బుమ్రా విలక్షణమైన బౌలింగ్ యాక్షన్తోనే బ్యాటర్లకు లయ దొరకదని చెప్పిన ఆకిబ్ జావేద్.. అతన్ని మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్తో పోల్చాడు. 'ఫాస్ట్ బౌలింగ్లో బుమ్రా ఒక ఉస్మాన్ తారిఖ్ లాంటివాడు'అని అభివర్ణించాడు.
అయితే ఈ పోలికపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచ స్థాయి పేసర్ను ఒక సాధారణ స్పిన్నర్తో పోల్చడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.