మెల్బోర్న్: టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్గేల్ త్వరలో ఆస్ట్రేలియా గడ్డపై మెరుపులు మెరిపించనున్నారు. మెల్బోర్న్కు చెందిన 'మల్గ్రేవ్ క్రికెట్ క్లబ్'కు ఈ ఇద్దరు కలిసి ఆడనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందాలపై వారితో సంప్రదింపులు జరుపుతున్నామని క్లబ్ వెల్లడించింది.
ఈ ఏడాది నవంబర్ నంచి ఫిబ్రవరి మధ్య జరిగే టీ20 టోర్నీలో వీళ్లు పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే 90 శాతం చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆ క్లబ్ అధ్యక్షుడు మిలాన్ పుల్లెనయెగమ్ పేర్కొన్నారు. వీరితో పాటు విండీస్ దిగ్గజం బ్రియన్లారా, సౌతాఫ్రికా మాజీ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ను సైతం తమ క్లబ్లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
'మేము శ్రీలంక ఆటగాళ్లు తిలకరత్నె దిల్షాన్, ఉపుల్ తరంగా, సనత్ జయసూర్య(హెడ్కోచ్)తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. మరికొంత మంది పేరుమోసిన ఆటగాళ్లను కూడా తీసుకునే పనిలో నిమగ్నమయ్యాం. ఈ క్రమంలోనే క్రిస్గేల్, యువరాజ్తో సంప్రదింపులు చేస్తున్నాం. ఇప్పటికే వారితో 90 శాతం చర్చలు పూర్తయ్యాయి. కొన్ని అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెద్ద క్రికెటర్లను తీసుకోవడం అనేది సుదీర్ఘ ప్రక్రియ.
వాళ్ల కోసం అనేక ఏర్పాట్లు చేయాలి. ఆస్ట్రేలియాకు రావడానికి, ఇక్కడ ఉండటానికి, ప్రయాణం, వసతి, ఆహారం ఇలా అన్నీ చూసుకోవాలి. అయితే, వారితో పాటు స్పాన్సర్ల నుంచి కూడా మా క్లబ్కు ఏదైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇవన్నీ చర్చల్లో భాగం. త్వరలోనే స్పష్టమైన సమాచారం అందిస్తాం' అని మిలాన్ వివరించారు. మరోవైపు ఈ విషయంపై యువీ, క్రిస్ గేల్ ఇంకా స్పందించలేదు.