సౌథాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ రెండో రోజు (శనివారం) ఆట కూడా పూర్తిగా జరగలేదు. వర్షం కారణంగా తొలి రోజు టాస్ పడకుండానే ఆగిపోయిన మ్యాచ్.. రెండో రోజు వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్ మధ్యలో నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి భారత్ స్కోరు 64.4 ఓవర్లలో 146/3గా నమోదైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (44; 124 బంతుల్లో 1x4), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (29; 79 బంతుల్లో 4x4) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 147 బంతుల్లో 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో రోజులో భారత్, న్యూజిలాండ్ జట్లు రెండూ ఆధిపత్యం చెలాయించాయి. మొదటగా భారత్.. ఆపై కివీస్.. అనంతరం టీమిండియా మ్యాచులో పైచేయి సాధించాయి.
ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదటగా బ్యాటింగ్కు దిగింది. మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడారు. ముందురోజు వర్షం పడడంతో పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలంగా మారింది. దీంతో కివీస్ స్టార్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ చెలరేగారు. ఇద్దరూ కట్టుదిట్టంగా బంతులేస్తున్నా.. రోహిత్-గిల్ వారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. భారీ షాట్లు ఆడకుండా, వికెట్ కాపాడుకుంటూ నిదానంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ భారత్ స్కోరును 50 పరుగులు దాటించారు.
అయితే కైల్ జేమీసన్ వేసిన 21 ఓవర్ మొదటి బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ (34; 68 బంతుల్లో 6x4) ఔటయ్యాడు. రోహిత్ స్లిప్లో టీమ్ సౌథీ చేతికి చిక్కడంతో.. భారత్ 62 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరికొద్ది సేపటికే నీల్ వాగ్నర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (28; 64 బంతుల్లో 3x4) ఔటయ్యాడు. 24 ఓవర్ మూడో బంతికి వికెట్ల వెనుక కీపర్ వాట్లింగ్ చేతికి చిక్కాడు. దాంతో కోహ్లీసేన 63 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. ఈ క్రమంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ, చేటేశ్వర్ పుజారా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 69/2తో తొలి సెషన్ను ముగించారు.
భోజన విరామం అనంతరం అనవసర షాట్లకు పోకుండా ఆచితూడి ఆడుతూ ఒక్కో పరుగు పెంచడంపైనే విరాట్ కోహ్లీ దృష్టిపెట్టాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన చేటేశ్వర్ పుజారా వికెట్ల ముందు దొరికిపోవడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ వేసిన 40.2 ఓవర్లో పుజారా పెవిలియన్ చేరాడు. 54 బంతులు ఆడిన పుజారా.. రెండు బౌండరీలతో 8 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఆపై విరాట్ కోహ్లీ, అజింక్య రహానే నిలకడగా ఆడారు. వీరిద్దరూ చెత్త బంతులను వదిలేస్తూనే.. మంచి బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోరును 100 దాటించారు.
అయితే వెలుతురు లేమితో అంపైర్లు ముందుగానే తేనీరు విరామంను ప్రకటించారు. రెండో సెషన్ పూర్తయ్యేసరికి భారత్ స్కోర్ 120/3గా నమోదైంది. ఈ సెషన్లో మొత్తం 27.3 ఓవర్ల పాటు ఆట కొనసాగగా.. భారత్ ఒక వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది. మూడో సెషన్లో మరింత జాగ్రత్తగా ఆడిన విరాట్ కోహ్లీ, అజింక్య రహానే నాలుగో వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరికి వెలుతురు లేమి కారణంగా 64.4 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమీసన్, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్ తలా ఓ వికెట్ తీశారు. మూడో రోజు వర్షం ఏం చేస్తుందో చూడాలి.
ట్విటర్తో నాకు మంచి కంటే నష్టమే ఎక్కువ జరిగింది!అందరూ ఇష్టపడేలా ట్వీట్లు ఎలా చేయాలో తెలియట్లేదు!