WTC Final: మరోసారి కోహ్లీసేనను ఎగతాళి చేసిన మైకేల్ వాన్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

లండన్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి భారత జట్టుపై విద్వేశాన్ని వెల్లగక్కాడు. అవకాశం దొరికినప్పుడల్లా టీమిండియాను తక్కువ చేస్తూ మాట్లాడే మైకేల్ వాన్ తాజాగా ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ను ఉద్దేశించి కూడా కోహ్లీసేనపై విషాన్ని చిమ్మాడు. పదేపదే ఎగతాళిగా.. వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తూ భారత అభిమానులను కవ్విస్తున్నాడు. తాజాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భారత ప్రదర్శనపై వెటకారంతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన భారత్ అభిమానులు అతడిపై మాటల యుద్ధం మొదలు పెట్టారు.
ఈపాటికే కివీస్ గెలిచేది..
'ఒకవేళ ఈ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఇంగ్లండ్లో కాకుండా మరో చోట నిర్వహిస్తే ఒక్క నిమిషమైనా ఆట కోల్పోయేవాళ్లు కాదు. మరో విషయం.. ఈ పాటికి న్యూజిలాండ్ విజేతగా నిలిచేది' అని వాన్ ట్వీట్ చేశాడు. వాన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. భారత ఆస్ట్రేలియా పర్యటన నుంచి తాజా డబ్ల్యాటీసీ ఫైనల్ మ్యాచ్ వరకు అవకాశం దొరికినప్పుడల్లా భారత జట్టును తక్కువ చేస్తూ ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. ఇక అభిమానులు కూడా తమదైన శైలిలో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్కు బదులిస్తున్నారు.
తొండాటతో గెలవలేదు..
ఇంగ్లండ్లా అడ్డదారిలో ప్రపంచకప్ గెలవలేదని, తొండాటతో విశ్వవిజేతగా నిలవలేదని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. అంపైర్ తప్పుడు నిర్ణయాలు, బౌండరీ కౌంట్ వంటి అడ్డదారులతో ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిందని గుర్తు చేస్తున్నారు. విలువ తక్కువ పనులు, క్రీడా స్పూర్తి దెబ్బతీసేలా భారత జట్టు ఎప్పుడూ వ్యవహరించలేదని, నలుగురు తలెత్తుకునేలా ఆడిందని చురకలంటిస్తున్నారు. భారత జట్టు విజయాలను మైకేల్ వాన్ ఏ మాత్రం ఓర్వలేకపోతున్నాడని, అసలు డబ్ల్యూటీసీ ఫైనల్ రావడమే అతనికి ఇష్టం లేదని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంగ్లండ్తో సిరీస్ సందర్బంగా స్పిన్ పిచ్లు రెడీ చేశారని వాన్ గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే.

నీ తిట్లే మా జట్టుకు దీవేన
ఇక మైకేల్ వాన్ ఏదీ చెప్పినా దానికి వ్యతిరేకంగా జరుగుతుందని, అతను భారత్ ఓడిపోతుందనుకుంటున్నాడని, చాంపియన్గా నిలిచేది కోహ్లీసేననే అని కామెంట్ చేస్తున్నారు. అతని తిట్లే భారత జట్టుకు దీవేనని కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు కూడా ఇదే తరహా అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశాడని, కోహ్లీ లేకుండా గెలవలేదని ఖునీ రాగాలు తీసాడని గుర్తు చేస్తున్నారు. కానీ యువ ఆటగాళ్లు దుమ్మురేపి చారిత్రాత్మక విజయంతో మైకేల్ వాన్ నోరు మూయించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు. మైకేల్ వాన్కు ఇండియా అంటేనే ఎక్కడో కాలుతదని, కోహ్లీసేన విజయాన్ని ఏ మాత్రం తట్టుకోలేడని కామెంట్ చేస్తున్నారు. అతనికి బర్నాల్ ఇవ్వాలని సూచిస్తున్నారు.

హోరాహోరీగా మెగాఫైనల్..
డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా మారింది. ఊహించినట్లుగానే ఆరో రోజుకు చేరింది. 'రిజర్వ్ డే' కారణంగా మ్యాచ్లో ఇంకా జీవం మిగిలి ఉంది. తొలి ఇన్నింగ్స్లో 32 పరుగుల ఆధిక్యం కోల్పోయిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 32 పరుగులు ముందంజలో నిలిచి మ్యాచ్ ఐదో రోజును ముగించింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు సాధించింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 101/2తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 249 పరుగులకు ఆలౌటైంది. విలియమ్సన్ (177 బంతుల్లో 49; 6 ఫోర్లు) రాణించగా... భారత బౌలర్లలో షమీ 4, ఇషాంత్ 3 వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications