సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఓటమి ముంగిట నిలిచింది. మ్యాచ్ రిజర్వ్ డే అయిన ఆరో రోజు న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 73 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ 32 పరుగుల ఆధిక్యం తీసేయగా.. కివీస్ ముందు 139 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. భారత ఇన్నింగ్స్లో రిషభ్ పంత్(41), రోహిత్ శర్మ(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), పుజారా(15), రహానే (15), జడేజా(16), అశ్విన్(7) దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ నాలుగు, ట్రెంట్ బౌల్ట్ మూడు, కైల్ జెమీసన్ రెండు వికెట్లు తీయగా.. నీల్ వాగ్నర్కు ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు 64/2 ఓవర్నైట్ స్కోర్తో రిజర్వ్ డే సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పర్ఫెక్ట్ ప్లాన్తో బౌలింగ్ చేసిన జెమీసన్ మరోసారి భారత్ను కోలుకోలేని దెబ్బతీశాడు. వరుస ఓవర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), చతేశ్వర్ పుజారా(15)ను పెవిలియన్కు చేర్చాడు. జెమీసన్ ధాటికి ఓవర్నైట్ స్కోర్కు కోహ్లీ 5 పరుగులే జత చేయగా.. పుజారా ఒక పరుగు మాత్రమే చేసి పేవిలియన్ చేరారు. ఆ వెంటనే పంత్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. జెమీసన్ బౌలింగ్లో అతను ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్లో సౌథీ వదిలేశాడు.
ఈ పరిస్థితులో వైస్ కెప్టెన్ రహానే(15) బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 37 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని బౌల్ట్ వీడదీసాడు. లెగ్ స్టంప్కు వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో రహానే కీపర్ క్యాచ్ వెనుదిరిగాడు. దాంతో భారత్ 130/5 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది. ఆ తర్వాత జడేజా(16)ను నీల్ వాగ్నర్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్తో పంత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ ట్రెంట్ బౌల్ట్.. ఈ ఇద్దరిని ఓకే ఓవర్లో ఔట్ చేసి కోలుకోలేని దెబ్బతీసాడు. చివర్లో షమీ(13) మూడు బౌండరీలు బాదడంతో 170 పరుగులు చేయగలిగింది. ఇక దూకుడు కనబర్చిన షమీని, జస్ప్రీత్ బుమ్రా(0)ను సౌథీ ఔట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.