పుణే: మహిళల టీ20 చాలెంజ్ టైటిల్ను హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ కైవసం చేసుకుంది. వెలాసిటీ జట్టుతో శనివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో ఆ జట్టు ఖాతాలో మూడో టైటిల్ చేరింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. డియాండ్ర డాటిన్(44 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్మన్ ప్రీత్ కౌర్(29 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో43) వేగంగా ఆడింది. వెలాసిటీ బౌలర్లలో కెట్ క్రాస్, దీప్తి శర్మ, సిమ్రాన్ బహదూర్ రెండేసి వికెట్లు తీయగా.. అయబోంగ ఖాక ఓ వికెట్ పడగొట్టింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెలాసిటీ .. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులే చేసి ఓటమిపాలైంది. లౌరా వోల్వార్డ్ట్(40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 65 నాటౌట్) చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. వెలాసిటీ విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు అవసరమవ్వగా.. వస్త్రాకర్ వేసిన 19వ ఓవర్లో వోల్వార్డ్ట్ నాలుగు బౌండరీలతో 17 పరుగులు పిండుకుంది. ఇక చివరి ఓవర్లో వెలాసిటీ విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. వోల్వార్డ్ట్ సిక్సర్ బాది మ్యాచ్ను ఉత్కంఠగా మార్చింది. అయితే చివరి బంతికి 6 పరుగుల అవసరమవ్వగా సింగిల్ రావడంతో వెలాసిటీ విజయం లాంఛనమైంది. సోఫీ, డియాండ్ర రెండు వికెట్లు తీయగా.. అలనా కింగ్ మూడు వికెట్లు పడగొట్టింది.