సిల్లేట్: మహిళల ఆసియాకప్ 2022లో భాగంగా మలేషియా జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత మహిళలు దుమ్మురేపారు. తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన(53 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 69) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. షెఫాలీ వర్మ(39 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో రిచా ఘోష్(19 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 33 నాటౌట్) ధాటిగా ఆడటంతో భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. మలేషియా బౌలర్లలో వినిఫ్రెడ్, దనియా రెండేసి వికెట్లు తీసారు. మలేషియాతో మ్యాచ్ కావడంతో స్మృతి మంధానాకు విశ్రాంతినిచ్చారు.
మేఘన టీ20 కెరీర్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేసింది... తొలి వికెట్కి 116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మేఘన అవుటైంది. టీమిండియా తరుపున 3 వన్డేలు, 12 టీ20 మ్యాచులు ఆడిన సబ్బినేని మేఘన, ఆంధ్రపద్రేశ్లో కృష్ణా జిల్లాలో 1996లో జన్మించింది. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ కారణంగా ఎక్కువగా రిజర్వు బెంచ్కే పరిమితమవుతున్న మేఘన... రాక రాక వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుంది..
39 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, నూర్ దనియా సుహెడా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. కిరణ్ నవ్గిరే డకౌట్ కాగా రాధా యాదవ్ 4 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ 19 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్తో 33 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా దయాలన్ హేమలత 4 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 10 పరుగులు చేసింది.
శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్లో 41 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత మహిళా జట్టు, తర్వాతి మ్యాచ్లో యూఏఈతో తలబడుతుంది. బంగ్లాదేశ్ వుమెన్స్ జట్టు, థాయిలాండ్పై 9 వికెట్ల తేడాతో విజయం అందుకోగా పాకిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది మలేషియా.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం అందుకున్న పాకిస్తాన్, పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. నేటి మ్యాచ్లో గెలిస్తే భారత మహిళా జట్టు, పాకిస్తాన్ని వెనక్కి నెట్టి టేబుల్ టాప్ పొజిషన్లోకి వెళ్తుంది..