సిల్లేట్: మహిళల ఆసియాకప్ 2022 టోర్నీలో భారత మహిళల టీమ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. యూఏఈ మహిళల జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో భారత అమ్మాయిలు సమష్టిగా రాణించడంతో 104 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో భారత్ తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసారు. జెమీమా రోడ్రిగ్స్(45 బంతుల్లో 11 ఫోర్లతో 75 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో తన ఫామ్ను కొనసాగించగా.. బ్యాటింగ్లో ప్రమోషన్ అందుకున్న దీప్తి శర్మ(49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 64) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. యూఏఈ బౌలర్లలో చాయ ముఘల్, మహికా గౌర్, ఇషా ఓజా, సురక్ష తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 74 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పూర్తిగా డిఫెన్స్కే పరిమితమైంది. కవిషా ఇగోడగే(54 బంతుల్లో 3 ఫోర్లతో 30 నాటౌట్), ఖుషి శర్మ(50 బంతుల్లో 3 ఫోర్లతో 29) జిడ్డు బ్యాటింగ్ ఆలౌటవ్వకుండా జట్టు పరువును కాపాడారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. దయాలన్ హేమలత ఓ వికెట్ పడగొట్టాడు.
భారత ఓపెనర్లు సబ్బినేని మేఘన(10), రిచా ఘోష్(0), నాలుగో బ్యాటర్ హేమలత(2) దారుణంగా విఫలమవడంతో భారత్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ, జెమీమా జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 128 పరుగులు జోడించారు. దాంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్ను భారత జట్టు ప్రాక్టీస్గా వాడుకుంది. హర్మన్ప్రీత్ కౌర్ రెస్ట్ తీసుకోగా.. స్మృతి మంధాన జట్టును నడిపించింది. కానీ మంధాన బ్యాటింగ్ చేయకుండా ఇతర బ్యాటర్లకు అవకాశం ఇచ్చింది. షెఫాలీ వర్మకు కూడా ఈ మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చారు. తొలి మ్యాచ్లో శ్రీలంకను ఓడించిన భారత్.. సోమవారం మలేషియాపై డక్ వర్త్ లూయిస్ పద్దతిలో గెలుపొందింది.