ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ విజేతగా నిలిచినా.. టోర్నీ అత్యుత్తమ జట్టు కాదని ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు. సెమీస్లో ఓడిన సౌతాఫ్రికానే అత్యుత్తమ జట్టు అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇది భారత్కి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ కాగా.. ఓవరాల్గా మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్. సెమీఫైనల్లో ఇంగ్లండ్ను ఓడించిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీ సూపర్-8 దశలో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓటమెరుగని జట్టుగా సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. న్యూజిలాండ్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారత జట్టు ప్రదర్శనను విశ్లేషించిన హార్మిసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'అభిషేక్ శర్మ-సంజూ శాంసన్ భాగస్వామ్యం ఫైనల్లో భారత్ను గెలిపించింది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై జస్ప్రీత్ బుమ్రా అసాధారణ బౌలింగ్ ప్రదర్శన ఇరు జట్ల మధ్య తేడాను చూపించింది.
ఈ టోర్నీలో భారత్ కీలక క్షణాలను ఒడిసిపట్టుకుంది. లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన చేయకపోయినా.. కీలక మ్యాచ్ల్లో సత్తా చాటింది. వెస్టిండీస్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లోనూ తడబడినా విజయం సాధించింది. ముఖ్యంగా సంజూ శాంసన్ అసాధారణ ప్రదర్శనతో భారత్ విజేతగా నిలిచింది.

న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ అద్భుతంగా ఆడిన ఒక మ్యాచ్ మినహా.. ఈ టోర్నీ మొత్తంలో సౌతాఫ్రికానే అత్యంత నిలకడగా రాణించింది. కానీ కీలకమైన సమయంలో చేతులెత్తేసి టోర్నీ నుంచి తప్పుకుంది. మరోవైపు తీవ్ర ఒత్తిడిని తట్టుకొని రాణించడంలో భారత్ ఇతర జట్ల కన్నా మెరుగ్గా నిలిచింది. వైట్బాల్ క్రికెట్లో భారత్ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.
సొంతగడ్డపై మ్యాచ్లు జరిగేంత కాలం భారత్కు తిరుగులేదు. అత్యుత్తమ జట్టు, నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉండటంతో పాటు స్వదేశంలో ఆడే అవకాశం వారికి అడ్వాంటేజ్గా మారింది. బీసీసీఐ.. ఐసీసీ కన్నా పవర్ఫుల్ కనుక.. భారత్కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేరు.’అని హార్మిసన్ చెప్పుకొచ్చాడు.
వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచుకుంది. వన్డే ప్రపంచకప్ 2023లోనూ వరుసగా 10 మ్యాచ్లు గెలిచి ఫైనల్ చేరినా.. ఆసీస్ చేతిలో ఓడి కప్పును చేజార్చుకుంది. 2023 నుంచి జరిగిన ఐసీసీ వైట్బాల్ టోర్నీల్లో భారత్ 33 మ్యాచ్ల్లో రెండింటిని మాత్రమే ఓడిపోయింది.
