షార్జా: మహిళల టీ20 చాలెంజ్ టోర్నీలో నయా చాంపియన్ అవతరించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ ఈ మహిళల ఐపీఎల్ 2020 టైటిల్ను సొంతం చేసుకుంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్తో సోమవారం జరిగిన టైటిల్ ఫైట్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ట్రయల్ బ్లేజర్స్ 16 పరుగులతో గెలుపొంది తొలిసారి టీ20 చాలెంజ్ టైటిల్ ముద్దాడింది. ఇక హ్యాట్రిక్ టైటిళ్లు అందుకోవాలనుకున్న హర్మన్ సేనకు నిరాశే ఎదురైంది.
ఈ తుదిపోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన(49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 68) ఒక్కతే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సూపర్ నోవాస్ బౌలర్లలో రాధా యాదవ్ (5/16) వికెట్లతో ట్రయల్బ్లేజర్స్ పతనాన్ని శాసించింది. ఆమెకు తోడుగా .. పూనమ్ యాదవ్, సిరివర్దనే చెరొక వికెట్ పడగొట్టారు.
అనంతరం సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(30)తో సహా అంతా విఫలమయ్యారు. ట్రయల్ బౌలర్లలో సాల్మా ఖాతును మూడు వికెట్లు తీయగా.. దీప్తీ శర్మ రెండు, సోఫీ ఎక్లెస్టోన్ ఓ వికెట్ తీసింది. ఇక 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ నోవాస్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. టాప్-3 బ్యాటర్లు చమరి ఆటపట్టు(6), జెమీమా రోడ్రిగ్స్(13), తానియా బాటియా(14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దాంతో సూపర్ నోవాస్ 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, సిరివర్దనే(19) పోరాడే ప్రయత్నం చేశారు. కానీ సల్మా ఖాతున్ ఇద్దర్ని ఔట్ చేసి దెబ్బతీసింది. అనంతరం సూపర్ నోవాస్ పేకమేడల్లా కూలింది. అనుజా పాటిల్(8), పూజా వస్త్రాకర్(0) వరుసగా పెవిలియన్ చేరారు. చివర్లలో చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో రాధా యాదవ్, సెల్మాన్ ఏం చేయలేకపోయారు.