ముంబై: ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ మల్హోత్రాపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఫైర్ అయ్యాడు. గతనెల ఓ జాతీయ చానెల్తో మాట్లాడిన అశోక్ మల్హోత్రా ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆటగాళ్లు, ఫస్ట్క్లాస్ క్రికెటర్లు తమ జీతాల్లో కోత విధించుకోవాలని, ఈ దిశగా ఆలోచించాలని సూచించాడు.
'ఆటగాళ్ల జీతాలు తగ్గించడం సరికాదని నాకూ తెలుసు, కానీ బీసీసీఐకి గతంలో మాదిరిగా ఆదాయం రావట్లేదు. కాబట్టి.. ఇప్పుడు క్రికెటర్లు తమ జీతాల్లో కోత విధించుకోవాలి' అని ఇండియన్ క్రికెటర్స్ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డాడు.
అయితే మల్హోత్రా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'మల్హోత్రా బీసీసీఐకి మంచిచేశాలా ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతోంది. అయితే, ఆటగాళ్ల జీతాల్లో కోత విధింపులపై మాట్లాడటానికి అతనికి అధికారం ఎవరిచ్చారు. ప్రస్తుత టీమిండియా ప్లేయర్లు, ఫస్ట్క్లాస్ క్రికెటర్లు.. ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్లో సభ్యులు కాదు. అలాంటప్పుడు వాళ్ల తరఫున మాట్లాడటానికి ఇతనెవరు? తమ జేబుకు చిల్లు పడనంత కాలం ఇతరుల జీతాల కత్తిరింపులపై మాట్లాడటం చాలా తేలిక' అని గావస్కర్ ఓ మీడియాకు రాసిన కాలమ్లో పేర్కొన్నాడు.
అంతకుముందు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. 'కరోనా నేపథ్యంలో ఏ చర్యలు తీసుకున్నా ప్రజలందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటివరకు ఆటగాళ్ల జీతాల్లో కోత గురించి ఆలోచించలేదు. పరిస్థితులు చక్కబడ్డాక వీటిపై చర్చిస్తాం'అని పేర్కొన్నాడు.
మరోవైపు కరోనా కారణంగా బీసీసీఐకి కాసులు కురిపించే ఐపీఎల్.. ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ మెగా టోర్నీ రద్దయితే మాత్రం బీసీసీఐ భారీ నష్టాల్ని చవిచూసే ప్రమాదం ఉంది.