— Cow Corner (@CowCorner9) October 2, 2020 |
క్రికెట్ ఈజ్ ఎ జెంటిల్మెన్ గేమ్..
అడ్డగోలు నిబంధనల వల్లే న్యూజిలాండ్ ఓడిందని ప్రపంచమంతా సానుభూతి కురిపిస్తుంటే, మరో 20 పరుగులు చేసి ఉంటే కప్పు గెలిచేవాళ్లం అని విలియమ్సన్ ప్రకటించుకున్నాడు. ఇంగ్లండ్ను విశ్వవిజేతగా అంగీకరించలేని మానసిక రుగ్మతలో క్రికెట్ మేధావులుంటే, ఈ న్యూజిలాండ్ సారథి మాత్రం లక్ష అడుగులు ముందుకేసి ప్రత్యర్థిని మనసారా అభినందించి, పెద్దరికం చూపించాడు. దేశవాళీ ఆటలో చిన్న పొరపాటు చేస్తేనే కెప్టెనిజం ప్రదర్శించి, ముఖం చిట్లించుకుని, సాటి సహచరుడు అని కూడా చూడకుండా బండబూతులు తిట్టే సారథులున్న ఈ రోజుల్లో.. విలియమ్సన్ మాత్రం క్రికెట్ ఈజ్ నాట్ యాన్ ఎమోషన్, ఇటీజ్ ఎ జెంటిల్మెన్ గేమ్ అని నిరూపించాడు.
|
అలాంటి విలియమ్సన్..
అలాంటి విలియమ్సన్ తొలిసారి ఆగ్రహానికి గురయ్యాడు. అది కూడా ఓ యువ ఆటగాడు చేసిన తప్పిదంపై కస్సుమన్నాడు. కరోనాతో ప్రపంచాన్నే అతలాకుతలమైనా ఈ 2020లో అభిమానులు విలియమ్సన్ ఆగ్రహాన్ని కూడా చూసేశారు. అంతా 2020 మహత్యం అంటూ సోషల్ మీడియా వేదికగా నిట్టూరుస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు ప్రియమ్ గార్గ్ చేసిన తప్పిదానికి విలియమ్సన్ రనౌట్ అయిన విషయం తెలిసిందే. బంతి షార్ట్ మిడ్ వికెట్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీయాలని భావించిన కేన్ పిలుపునకు ప్రియమ్ గార్గ్ స్పందించలేదు. దీంతో విలియమ్సన్ రనౌట్గా పెవిలియన్ చేరాడు. ప్రియమ్ చర్య పట్ల చిర్రెత్తుకుపోయిన విలియమ్సన్ ఎన్నడూ లేని విధంగా యువ ఆటగాడిపై నోరు పారేసుకున్నాడు.
కేన్ మెచ్చుకున్నాడు..
విలియమ్సన్ను రనౌట్ చేసాననే అపరాధ భావమో లేక గత మూడు మ్యాచ్లుగా అవకాశాలు రాలేదనే కసో ఏమో కానీ ప్రియామ్ గార్గ్(51 నాటౌట్) చెలరేగాడు. అభిషేక్ శర్మ (31)తో కలిసి అజేయ హాఫ్ సెంచరీతో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. ఆ తర్వాత సూపర్ ఫీల్డింగ్తో ఫాఫ్ డూప్లెసిస్ను పెవిలియన్కు చేర్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. అవార్డు స్వీకరించే సమయంలో గార్గ్ను కేన్ రనౌట్ గురించి ప్రశ్నించగా.. తాను ఎంతో అపరాధ భావానికి లోనయ్యానని చెప్పుకొచ్చాడు.
'నా తప్పిదం కారణంగా విలియమ్సన్ రనౌటై పెవిలియన్ చేరుతున్నపుడు చాలా బాధపడ్డా. సన్రైజర్స్ ఇన్నింగ్స్ అనంతరం డౌగౌట్కు చేరుకోగానే.. కేన్ నాతో మాట్లాడాడు. బాగా ఆడావ్.. బాధపడకు. ఆ రనౌట్ గురించి మర్చిపో. నీ బ్యాటింగ్ చాలా బాగుందని మెచ్చుకున్నాడు. కేన్ అలా అనగానే నాలో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోయింది'అని ఈ యువ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
అంతా కేన్ మామ పుణ్యం..
ఇక తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ గత రెండు మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. అయితే ఈ గెలుపు క్రెడిట్ అంతా కేన్ విలియమ్సన్దేనని సన్రైజర్స్ అభిమానులు అంటున్నారు. అతను ఆరెంజ్ ఆర్మీ లక్కీ చార్మ్ అంటూ కొనియాడుతున్నారు. ‘కేన్ మామ పుణ్యమా హైదరాబాద్ వరుస విజయాలందుకుంటుంది'అని ఒకరంటే.. ‘దటీజ్ కేన్.. రాణించినా.. విఫలమైనా జట్టులో ఉండాల్సిందే'అని మరొకరు కామెంట్ చేసారు.
చెన్నైతో జరిగిన తాజా మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 47 నాటౌట్), రవీంద్ర జడేజా(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 50) రాణించినా ఫలితం లేకపోయింది.
అవే తప్పిదాలు మళ్లీ మళ్లీ చేసి మూల్యం చెల్లించుకున్నాం: ధోనీ