
న్యూఢిల్లీ: టెస్ట్ ఫార్మాట్లో సొంతగడ్డపై భారత్ను ఓడించడం ఏ జట్టుకైనా అంత సులువైన పని కాదు. ఈ విషయం బాగా తెలిసిన ఆస్ట్రేలియా టీమ్ బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్ సెషన్స్లో చెమటలు చిందిస్తోంది. ఉపఖండ పిచ్లపై బ్యాటింగ్ చేయడం విదేశీ ఆటగాళ్లకు పెద్ద సవాల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్లను ఎదుర్కోవడం అంత ఆశమాషి వ్యవహర కాదు. ఈ క్రమంలోనే స్పిన్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆస్ట్రేలియా ఈ స్టార్ స్పిన్నర్లను పోలీ ఉన్న భారత యువ స్పిన్నర్లతో నెట్స్లో చెమటోడుస్తోంది.
అశ్విన్ బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్న బరోడా స్పిన్నర్ మహీష్ పితియాను నెట్ బౌలర్గా చేర్చుకొని తెగ ప్రాక్టీస్ చేస్తోంది. భారత పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండటంతోపాటు అశ్విన్ ప్రమాదకరంగా మారతాడనే అంచనాతో ఆసీస్ ఈ ఏర్పాట్లను చేసుకొంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాను రెచ్చగొట్టేలా టీమిండియా మాజీ ప్లేయర్ వసీమ్ జాఫర్ ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా మరో ఐదు రోజుల్లో నాగ్పుర్ వేదికగా భారత్ - ఆసీస్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. దీంతో ఐదు రోజులు ముందుగానే రవిచంద్రన్ అశ్విన్ ఆసీస్ ఆటగాళ్ల తలలోకి దూరిపోయాడని జాఫర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'మొదటి టెస్టుకు ఇంకా ఐదు రోజులే సమయం. అయితే ఇప్పటికే అశ్విన్ ఆస్ట్రేలియా బుర్రలోనే ఉండిపోయాడు'అని క్రికెట్ ఆస్ట్రేలియా పెట్టిన వీడియోలను కామెంట్ చేస్తూ జాఫర్ పోస్టు పెట్టాడు. మరోవైపు భారత్ కూడా తమ ప్రాక్టీస్ సెషన్స్లో నలుగురు స్పిన్నర్లను నెట్ బౌలర్లుగా వినియోగించుకొంటోంది.